ఇలాగైతే మూసేద్దాం: సీఎం కేసీఆర్కు కోపం వచ్చింది
హైదరాబాద్: ఆర్టీసి లాభాల్లోకి వచ్చేందుకు ఎంతో అవకాశముందని, అయినా అది నష్టాల్లోనే కొనసాగుతోందని, ఇలా నష్టాల్లో ఉంటే ఇక సంస్థ ఎందుకని, మూసేద్దామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆర్టీసి అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
అందరూ సహకరిస్తేనే ఆర్టీసీని నడుపుదామని, లేదంటే వదిలేద్దామని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఆర్టీసిని గాడిన పెట్టేందుకు సీఎం కేసీఆర్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ముఖ్య కార్యదర్శి సునీల్, సంస్థ ఎండీ రమణా రావు తదితరులతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... నష్టాల్లో ఉన్న ఆర్టీసిని నడపడం కంటే మూసివేయడం మేలని కేసీఆర్ అన్నారని తెలుస్తోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసిని గట్టెక్కించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడాన్ని అర్థం చేసుకోకుండా రాజకీయ కారణాలతో కార్మికులు సమ్మెలు చేయడం మంచిది కాదన్నారు.
ఆర్టీసి నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికులకు 44 శాతం ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇవేవి పట్టించుకోకుండా కార్మికులు సమ్మెకు దిగితే కఠిన చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు. ఆర్టీసిని గట్టేక్కించేందుకు హైదరాబాద్ బస్సులను జీహెచ్ఎంసీకి అనుసంధానం చేశామన్నారు.
ఆర్టీసీని నష్టాలోంచి కాపాడేందుకు ప్రభుత్వమే నిధులు విడుదల చేసిందన్నారు. కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చి వేతనాలు పెంచామన్నారు. అయినప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా తరుచూ సమ్మెలకు దిగడం వల్ల ఆర్టీసి మరింత నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నారు.
పరిస్థితిని అర్థం చేసుకొని కార్మికులు సహకరిస్తే ఆర్టీసిని నడుపుదామని, లేదంటే ఆర్టీసిని వదులుకుందామనే ప్రతిపాదనపై సమావేశంలో చర్చకు వచ్చింది. రోజుకు 90 లక్షల మంది ఆర్టీసిలో ప్రయాణం చేస్తున్నప్పటికీ నష్టాల్లో ఉండటానికి కారణాలు ఏమిటో లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసి బస్సులను నడపటం లేదనే వాస్తవాన్ని గమనించాలన్నారు.












Click it and Unblock the Notifications