సాక్షి ప్రసారాలపై బ్యాన్: జగన్ పార్టీ మాస్టర్ ప్లాన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీ చానెల్ ప్రసారాల నిలిపివేతను తిప్పికొట్టడానికి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజమో కానీ ఇదే గనుక జరిగితే ఎంఎస్ఓలు భారీగా నష్టపోతారనే ప్రచారం సాగుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కేబుల్ ఆపరేటర్లకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ షాక్ ఇవ్వడానికి సిద్ధఫడినట్లు ప్రచారం సాగుతోంది. గతంలో ఎన్టీవీ న్యూస్ చానెల్ ప్రసారాలను ప్రభుత్వం అడ్డుకుని దారిలోకి తెచ్చుకుందని అంటున్నారు. సాక్షి విషయంలో అది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. సాక్షి ప్రసారాలను రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేసింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులందరితో కేబుల్ ఆపరేటర్లకు సెటప్ బాక్సులను వెనక్కు ఇప్పించేందుకు స్కెచ్ రెడీ చేసినట్లు చెబుతున్నారు. ఒక్కో మండలంలో కనీసం 5వేలమంది స్పందిస్తారని అంచనా వేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25లక్షల కనెక్షన్లుపై వచ్చే ఆదాయాన్ని ఎంఎస్ఓ.లు కోల్పోతారని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఒక్కో కనెక్షన్ కు సగటున 150రూపాయల చొప్పున 37కోట్ల 50లక్షలు ఆపరేటర్లు ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది.
ఇదే సమయంలో డిష్ నెట్ వర్కుల యాజమాన్యాలతో మాట్లాడి డీల్ సెట్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఒకేసారి 25లక్షల కనెక్షన్లు వస్తాయంటే ఏ డిష్ నెట్ వర్క్ అయినా ఎగిరి గంతెయ్యడం ఖాయమని అంటున్నారు. ఇప్పుడు ఈ డీల్ ను దక్కించుకునేందుకు అందరూ పోటీపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏమైనా చంద్రబాబుపై ఇది టిట్ ఫర్ టాట్లా పనిచేస్తుందని అంటున్నారు.