మూర్ఖత్వం: 17 మంది పిల్లల్ని కనేశారు
తమను సాకడానికి మగపిల్లాడు కావాలంటూ ఓ జంట ఏకంగా 17 మంది పిల్లల్ని కనేసింది. చివరకు కుటుంబ నియంత్రణకు అంగీకరించింది.
అహ్మదాబాద్: మగ పిల్లాడు కావాలనే మూర్ఖత్వంతో ఈ కాలంలోనూ ఓ జంట ఏకంగా 17 మంది పిల్లల్ని కనేసింది. ఈ 17 మందిలో 16 మంది ఆడపిల్లలు కాగా, ఒక మగ పిల్లాడున్నాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని దోహాద్ అనే గిరిజన జిల్లాలో జరిగింది. ఊరంతా పూనుకోకపోతే 18వ బిడ్డను కనేవారే.
వారికి 2013లో మాత్రం ఒక మగబడ్డ జన్మించాడు. అయితే ఇంతమందిని సాకాలంటే మరో మగబిడ్డ ఉండాలని ఆ ఇంటి పెద్ద మనిషి కోరుకున్నాడు. అయితే ఊరు ఊరంతా కలిసి నచ్చజెప్పడంతో ఆ దంపతులు ఎట్టకేలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు.

'గ్రామమంతా కలిసి వచ్చి నచ్చచెప్పకపోతే మేమిద్దరం, మాకు 17మంది నుంచి మాకు 18 మంది అయి ఉండేది' అని 44 ఏళ్ల రామ్సిన్హ్ అన్నారు. ఆయన భార్య కాను సంగోత్ (40) పక్షం రోజుల క్రితం ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారు. కాను 2015 సెప్టెంబర్లో 16వ బిడ్డగా స్మృత అనే కుమార్తెకు జన్మనిచ్చారు. రామ్సింహ్కు 17వ బిడ్డ ఎప్పుడు జన్మించిందో తేది గుర్తులేదు. అతనికి 2013లో కుమారుడు జన్మించాడు.
వృద్ధాప్యంలో తమ మంచిచెడులు చూడటానికి తొలుత ఒక కుమారుడు పుట్టాలని అనుకున్నానని, అయితే ఎక్కువ మంది కుమార్తెలు పుట్టడంతో వారి బాగోగులు కూడా చూడటానికి మరో కుమారుడు కావాలని తరువాత కోరుకున్నానని రామ్సింహ్ వివరించారు. కాని, అది జరగలేదని ఆయన చెప్పారు. శిథిలావస్థలో ఉన్న మట్టి ఇంట్లో నివసిస్తున్న రామ్సింహ్ రెండు బిఘాల భూమిలో మొక్కజొన్న, గోధుమ పండిస్తున్నారు. అతను, అతని భార్య తమ పెద్ద కుటుంబాన్ని పోషించడానికి అదనపు సంపాదన కోసం వ్యవసాయ కూలీలుగా కూడా పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications