పవన్ కల్యాణ్ ఫ్యాక్టర్: జగన్ను కాంగ్రెసు దువ్వుతోందా...
కాంగ్రెసు పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని దువ్వుతున్నట్లు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్ ప్రకటన అందుకు ఊతం ఇస్తోంది. ఏమవుతుందో చూడాలి.
హైదరాబాద్: రాష్ట్ర విభజనతో ఎటూ కాకుండా పోయిన కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికి కోసం నానా అగచాట్లు పడుతోంది. సమీప భవిష్యత్తులో అది పుంజుకునే పరిస్థితులు ఏమీ లేవు. ఈ స్థితిలో ఆ పార్టీ ఓ ఆసరా కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా కాంగ్రెసు పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని దువ్వుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రవేశంతో కాంగ్రెసుకు మరింతగా కష్టాలు వచ్చి పడ్డాయి. మూడో స్థానంలోనైనా పరిస్థితి కనిపించడం లేదు.
కాంగ్రెసు పార్టీకి మీడియా మద్దతు కూడా లేదు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు రఘువీరా రెడ్డి గంభీరమైన ప్రకటనలు చేసినప్పటికీ ఫలితం ఉండడం లేదు. ఈ స్థితిలో జగన్తో కలిసి నడిచేందుకు కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెసు నేత సి. రామచంద్రయ్య ప్రకటన మాత్రమే కాకుండా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ప్రకటన కూడా అందుకు ఊతం ఇస్తోంది.
రామచంద్రయ్య ఇలా అన్నారు...
నారా చంద్రబాబు నాయుడు కేవలం వెన్నుపోట్లతో ముఖ్యమంత్రి అయ్యారని, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రేమతో, అభిమానంతో ప్రతిపక్ష నేత అయ్యారని కాంగ్రెసు నేత సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. సి. రామచంద్రయ్య ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవితో పాటు కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు.
దిగ్విజయ్ ఇలా....
సి. రామచంద్రయ్య ఏదో అనేశారు, ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు. కానీ స్వయానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ జగన్పై చేసిన ప్రకటన ఆసక్తికరంగా ఉంది. ఎన్నో ఆర్థిక ఆరోపణలు ఎదుర్కంటున్న చంద్రబాబునాయుడికి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు లేదని ఆయన అనేశారు. అయితే, మొదటి నుంచి కూడా దిగ్విజయ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నారు.
చిరంజీవిపై అశలు పెట్టుకోలేరా....
కాంగ్రెసు అధిష్టానం ప్రజాదరణ గల చిరంజీవిపై ఆశలు వదిలేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో హిట్ కొట్టి జోరు మీదున్నారు. సినిమాల్లో ఆయన బిజీగా ఉంటున్నారు. మరోవైపు, టీవీ చానెల్లో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ స్థితిలో ఆయన పార్టీకి సమయం కేటాయించే పరిస్థితి కూడా లేదు. ఎన్నికల నాటికి ఆయన తిరిగి కాంగ్రెసు తరఫున జోరందుకుంటారా లేదా అనేది చూడాల్సిందే.
పవన్కు కాంగ్రెసు అంటేనే...
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కాంగ్రెసు పార్టీ అంటేనే మహా చిరాకు. చిరంజీవి ప్రజారాజ్యం అనుబంధ సంస్థ యువరాజ్యం అధినేతగా ఆయన పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెసు నాయకులను పంచెలూడదీసి కొడుతానని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తన పార్టీలో అన్నయ్య చిరంజీవికి స్థానం ఉండదని ఆయన తేల్చేశారు. అన్నదమ్ములిద్దరు చెరో పడవపై ప్రయాణించడానికే సిద్ధపడినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ చురుగ్గా రాజకీయాలు చేస్తున్న క్రమంలో జగన్తో వెళ్లడం ద్వారా ఉనికిని చాటుకోవచ్చునని కాంగ్రెసు భావిస్తున్నట్లు అనుకోవచ్చు.