‘అత్యంత చెత్త ఫోన్ కాల్’ ఇదేనట!: ఆ దేశాధినేతపై ట్రంప్ తీవ్ర స్వరం
ఇటీవల అందరు దేశాధినేతల మాదిరిగానే ఆస్ట్రేలియా ప్రధాని టర్న్బుల్తో కూడా ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నోటి దురుసును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తనపై ఆరోపణలు చేసిన వారిపై, మీడియాపై పలుమార్లు తీవ్రంగా దూషించిన ట్రంప్.. ఇప్పుడు చాలా కాలంగా మిత్ర దేశమైన ఆస్ట్రేలియాపై పడ్డారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఆస్ట్రేలియా ఏదో ఒక సందర్భంలో ట్రంప్ను వెనకేసుకొస్తున్నప్పటికీ... ఆయన మాత్రం చల్లబడటం లేదు.
ఇటీవల అందరు దేశాధినేతల మాదిరిగానే ఆస్ట్రేలియా ప్రధాని టర్న్బుల్తో కూడా ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రపంచ దేశాధినేతలతో తాను ఆ రోజు మాట్లాడిన ఫోన్ కాల్స్లో 'అత్యంత చెత్త ఫోన్ కాల్' ఇదేనని ట్రంప్.. టర్న్బుల్తో చెప్పినట్టు 'ది వాషిగ్టన్ పోస్ట్' వెల్లడించింది.
షెడ్యూల్ ప్రకారం గంటసేపు ఆస్ట్రేలియా ప్రధానితో మాట్లాడాల్సి ఉండగా కేవలం 25 నిమిషాల్లోనే సంభాషణ ముగించినట్టు పేర్కొంది. ఆస్ట్రేలియా నుంచి 1,250 మంది శరణార్థులను అమెరికాలోకి ప్రవేశించే విధంగా ఒబామా ప్రభుత్వంతో తాము చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలని టర్న్బుల్ కోరుతున్నట్టు ట్రంప్ ముందే పసిగట్టినట్టు చెబుతున్నారు.
టర్న్బుల్ మాట్లాడుతుండగానే ట్రంప్ కలగజేసుకుని... 'అదే జరిగితే ఇంతకన్నా చెత్త ఒప్పందం మరోటి ఉండదు... మరోసారి అమెరికాకి బోస్టన్ బాంబర్లను పంపేందుకు మీ దేశం ప్రయత్నిస్తోంది' అని తీవ్ర స్వరంతో పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షభవనం వైట్హౌస్ వర్గాలు మాత్రం వీరిద్దరి మధ్య సంభాషణ 'ఇరు దేశాల సంబంధాలు బలపడేలా సాగింది' అని పేర్కొనడం గమనార్హం.
ఒబామా ప్రభుత్వంతో ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకున్న శరణార్థుల్లో ఇరాక్, ఇరాన్, సూడాన్, సోమాలియా దేశాలనుంచి వచ్చిన వారుకూడా ఉన్నారు. ప్రస్తుతం వారు ఆస్ట్రేలియా తీరంలోని దీవుల్లో ఆశ్రయం పొందుతున్నారు. వీరి విషయంలోనే ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.