పవన్ సంగారెడ్డి సభ వెనుక జగ్గారెడ్డి!: ఏ వ్యూహంతో జనసేన అడుగులు?..
ఏరికోరి పవన్ సంగారెడ్డిలోనే సభ పెట్టడం వెనుక.. ఆయన సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హస్తం ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు.
సంగారెడ్డి: వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోను పోటీ చేస్తామని, ఇకనుంచి పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రచిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, తెలంగాణలో పార్టీ బలోపేతాన్ని 'సంగారెడ్డి సభ' నుంచి మొదలుపెట్టనున్నట్లు ఆయన సంకేతాలు పంపించారు.
అయితే ఏరికోరి పవన్ సంగారెడ్డిలోనే సభ పెట్టడం వెనుక.. ఆయన సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హస్తం ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. పవన్ తో సాన్నిహిత్యం ఉన్న నేత కావడంతో సభ ఏర్పాటు దగ్గరి నుంచి, జన సమీకరణ వరకు జగ్గారెడ్డి తెర వెనుక నుంచి పనిచేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఉద్దేశంతోనే పవన్ సంగారెడ్డి సభ ప్లాన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

కాగా, జనసేన ఏర్పడిన మూడేళ్లలో సంగారెడ్డిలో నిర్వహించబోయే సభనే రాష్ట్రంలో ఆ పార్టీకి తొలి సభ కావడం గమనార్హం. తెలంగాణ ఉద్యమ సమయంలో.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన జగ్గారెడ్డిని.. తెలంగాణలో తనకు ఇష్టమైన నాయకుడిగా పవన్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.
అప్పటినుంచి అడపా దడపా ఈ ఇద్దరి మధ్య భేటీలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల సంగారెడ్డి శివారులో పవన్ సినిమా షూటింగ్ జరిగిన సమయంలోను జగ్గారెడ్డి అక్కడికి వెళ్లి కలిశారు. అయితే ఆ సమయంలో ఇద్దరి మధ్య చర్చకు వచ్చిన విషయాలను వెల్లడించేందుకు జగ్గారెడ్డి నిరాకరించారు. మొత్తం మీద తెలంగాణలోను జనసేన పోటీకి సిద్దమైతే జగ్గారెడ్డి పవన్ పంచెన చేరే అవకాశాలు కూడా లేకపోలేదనేది పలువురి అభిప్రాయం.












Click it and Unblock the Notifications