మామిడి అల్లం రసం.. ఒక్కసారి ట్రై చేస్తే వదిలిపెట్టరు
ఎప్పుడూ ఒకే రకం రుచులను కాకుండా, వినూత్నంగా రకరకాల వంటలను ట్రై చెయ్యాలి అని చాలా మంది అనుకుంటూనే ఉంటారు . అలాంటి వాటిలో మామిడి అల్లం రసం ఒకటి . ఇది మామూలు అల్లంతో కాకుండా, మామిడి రుచిని పోలిన అల్లంతో చేసే ప్రత్యేకమైన రుచికరమైన చారు.మామిడి అల్లం సాధారణ అల్లంలా కనిపించినా, దీని రుచి మాత్రం భిన్నంగా ఉంటుంది.
మామిడి అల్లం చారు
మామూలు అల్లం ఘాటుగా ఉంటే, మామిడి అల్లం పచ్చి మామిడికాయంత పుల్లని, సుగంధ భరితమైన రుచిని కలిగి ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ప్రత్యేకమైన చారును తయారు చేయడానికి ప్రధానంగా 80 గ్రాముల మామిడి అల్లం అవసరం. దీంతో పాటు, 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 18 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, అర టీ స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు సిద్ధం చేసుకోవాలి.

కావాల్సిన పదార్దాలివే
అలాగే 50 గ్రాముల చింతపండు, 6 టమోటాలు, తగినంత కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 4 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకోవాలి. తాలింపు కోసం 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 6 టేబుల్ స్పూన్ల పచ్చికొబ్బరి తురుము, కొద్దిగా ఇంగువ సిద్ధం చేసుకోవాలి.
తయారీ ఇలా
తయారీ విషయానికి వస్తే, ముందుగా మిక్సీ జార్లో 80 గ్రాముల మామిడి అల్లం తీసుకోవాలి. దీనికి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 14 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు కలిపి వీలైనంత మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. అనంతరం, మరో గిన్నెలో 50 గ్రాముల చింతపండును తగినన్ని నీళ్లలో 15 నిమిషాల పాటు నానబెట్టాలి.
రసం ఇలా తయారు చేసుకోవాలి
చింతపండును చేతితో బాగా పిసికి రసం తీసి, పిప్పిని తొలగించాలి. ఆ చింతపండు రసంలో 2 కట్టల కొత్తిమీర, 6 టమాటాలను వేసి గట్టిగా పిసికి, ఆపై పిప్పిని పారవేయాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని, అందులో సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని పోయాలి. దీనికి కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ముందుగా రుబ్బుకున్న మామిడి అల్లం పేస్ట్, అర టీస్పూను పసుపు కలపాలి.
ఘుమఘుమలాడే మామిడి అల్లం చారు రెడీ
అనంతరం 3 లీటర్ల నీరు పోసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిసేలా చూడాలి. మీడియం మంటపై 15 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత, చారులోకి 4 టేబుల్ స్పూన్ల బెల్లం, 4 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఘుమఘుమలాడే ఈ చారును కొన్ని సెకన్ల పాటు ఉంచి, వెంటనే స్టవ్ ఆపేయాలి.
ఇలా పోపు చేస్తే సూపర్ టేస్ట్
అనంతరం, తాలింపు సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడిచేయండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసి, అవి చిటపటలాడే వరకు నిదానంగా వేయించాలి. ఆ తర్వాత 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 6 టేబుల్ స్పూన్ల పచ్చికొబ్బరి తురుము కలిపి దోరగా వేగే వరకు వేయించండి.
ఒకసారి ట్రై చేస్తే వదిలిపెట్టలేని చారు
చివరగా కొద్దిగా ఇంగువ వేసి బాగా కలిపి, స్టవ్ ఆపివేయండి. ఇలా సిద్ధం చేసుకున్న తాలింపును చారు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వేడివేడి, ఘుమఘుమలాడే మామిడి అల్లం చారు వడ్డించడానికి సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ అల్లం ఘాటు ఎక్కువగా అనిపిస్తే, చివరలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని రుచిని సమం చేసుకోవచ్చు. ఈ చారును ఒకసారి ట్రై చేస్తే అసలే వదిలిపెట్టరు.













Click it and Unblock the Notifications