వంకాయ శనగపప్పు మసాలా కూర.. తింటే అసలే వదిలిపెట్టరు!
ప్రతిరోజు మనం రకరకాల కూరలను వండుకొని తింటూ ఉంటాం. మనం తీసుకునే ఆహారం రుచి కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా ఉండేలా చూసుకుంటాం. మనం తీసుకునే ఆహారంలో కూరల పాత్ర చాలా ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే అనేక కూరగాయలను మనం ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. కూరగాయలలో రాజుగా చెప్పే వంకాయతో శనగపప్పు మసాలా కూర ఎలా తయారు చేయాలో చూద్దాం.
వంకాయ శనగపప్పు మసాలా కూర కావాల్సిన పదార్థాలు:
వంకాయలు- పావు కిలో చిన్నగా కట్ చేసుకున్నవి
శనగపప్పు- అర కప్పు( రెండు గంటలపాటు నానబెట్టుకున్నవి )
ఉల్లిపాయ- ఒకటి సన్నగా తరిగినది
పచ్చిమిరపకాయలు- మూడు సన్నగా తరిగినవి
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 స్పూన్
కారం- 1 స్పూన్
ఉప్పు- రుచికి తగినంత
ధనియాల పొడి- ఒక టీ స్పూన్
పసుపు- పావు టీ స్పూన్
గరం మసాలా- పావు టీ స్పూన్
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
పోపు గింజలు- ఒక స్పూన్
కరివేపాకు- రెండు రెమ్మలు
కొత్తిమీర- కొద్దిగా

తయారీ విధానం
ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకుని, స్టవ్ వెలిగించి పాన్ వేడి అయిన తర్వాత అందులో రెండు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత పోపు గింజలు వేసి, ఆపై కరివేపాకు వేసి ఫ్రై కానివ్వాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి.
ఇలా వండితే రుచిగా ఉంటుంది
ఆపై అందులో నానబెట్టుకున్న శనగపప్పును వేసి, పసుపు, ఉప్పు కూడా వేసి మూతపెట్టి మగ్గించాలి. శనగపప్పు సగానికి పైగా ఉడికే వరకు అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. సగానికి పైగా శనగపప్పు ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి కలపాలి. ఇప్పుడు వంకాయ శనగపప్పు పూర్తిగా ఉడికేలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి.
అన్నం, చపాతీ, పూరీ దేనిలోకైనా సూపర్
ఆపై అందులో ఒక స్పూన్ కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి మళ్లీ ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన వంకాయ శనగపప్పు మసాలా కర్రీ రెడీ అవుతుంది. ఈ కూర అన్నం కానీ చపాతి, పూరి వేటిలోకైనా బాగుంటుంది.












Click it and Unblock the Notifications