ఇదొక్కటి చేస్తే.. అష్టగ్రహ కూటములు కూడా ఏమీ చేయలేవు!!
భగవంతుడు దేవాలయంలోనే ఉంటాడు కాబట్టి ప్రతిరోజు మనం అక్కడికెళ్లి ప్రదక్షిణాలు చేయడంతోపాటు కొబ్బరికాయ కొట్టి పలు రకాల కోర్కెలను తీర్చమంటూ ఆయన ముందు అర్జీ పెడతాం. ఆయన భోళా శంకరుడు కాబట్టి మనం అడిగిందల్లా ఇస్తున్నాడు. కానీ మనం ఆయనకు కావల్సింది ఎప్పుడైనా చేస్తున్నామా? స్వామీ.. మమ్మల్ని బాగా చూసుకుంటున్నావు.. అందుకు మేం నీకు రుణపడి ఉంటాం.. నీకు కావల్సింది ఏదో చెప్పు.. చేస్తాం అని అడిగేవారే ఉండదు. ఒకవేళ అడిగినా ఆయన ఒట్టి మాలోకం కాబట్టి మన మంచికి సంబంధించినదే అడుగుతాడు.

నన్ను చూడు.. నిన్ను చూడు
నువ్వు మానవుడిలా ఆలోచించడం మానివేయి.. నువ్వు దైవస్వరూపుడివని తెలుసుకో.. నన్ను చూడు.. నిన్ను చూడు.. ఇద్దరినీ కలిపి చూడరా అంటాడు. అది దర్శనం అంటే. భగవంతుడున్నాడనేదానికి నిదర్శనం. అంటే మనలోనే భగవంతుడున్నాడని, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయమని సూచిస్తున్నాడు. మనకు కావల్సింది దర్శనం.. కోరుకోవాల్సింది కూడా దర్శనమే. ఎప్పుడైనా మనిషి దేవాలయానికి వెళితే దర్శనం మీదే దృష్టి ఉండాలి. పెద్ద పెద్ద దేవాలయాల్లో ఎక్కడా మనకు తీర్థం ఇవ్వరు. అక్కడ ప్రధానమైంది భగవంతుడి దర్శనం.

భగవంతుడి నామం చాలా గొప్పది
జాతకాలు, సిద్ధాంతాలనేవి సమిష్టి జీవనానికి సంబంధించినవి. వాటిని స్థూలంగా పాటించాలేకానీ సూక్ష్మంగా పాటించకూడదు. మనసులో ఇష్టమైన భగవంతుడి స్మరణ చేసుకునేవారిని, స్థిరమైన సంకల్పం ఉన్నవారిని, భగవంతుడి నామ్మాన్ని సదా మనసులో స్మరిస్తూ పట్టుదలతో లక్ష్యంవైపు పయనించేవారిని ఎవరూ ఏమీ చేయలేరు. ఏ గ్రహాలు బాధింపలేవు. వేరే ఎవరికో మనం వేలకు వేలరూపాయలు డబ్బులు చెల్లించి పూజలు చేయమంటున్నాం. కనీసం మన కష్టం తొలగాలంటే మనమే పూజ చేసుకోవాలి. వేరే ఎవరో పూజ చేస్తే కష్టం ఎందుకు తొలగుతుంది. తన మనసులో సదా పరమేశ్వరుణ్ని ధ్యానించేవారికి, ఆ నామం మనసులో పలుకుతున్నవారి జోలికి సూర్యచంద్రాదులేకాదు.. రాహుకేతువులేకాదు.. అష్టగ్రహ కూటమలు కూడా రాలేవు. భగవంతుడి నామం యొక్క గొప్పదనం అది.

కైవల్యం కోసం కృషి చేయాలి
ఈశాన్యంలో శివుడు ఉంటాడు కాబట్టి ఇంట్లో పూజా మందిరం ఈశాన్యం వైపు పెడతారు. కానీ మనకు పెద్ద పెద్దగదులు 2 లేదంటే 3 ఉంచుకొని భగవంతుడికి కేవలం ఒక చిన్న పక్షి గూడులాంటిది కడతాం. అది కూడా అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. అన్నీ ఇచ్చే భగవంతుడిని చిన్న మూలన, చిన్న గదిలో బంధిస్తావా? విశాలమైన గదిని భగవంతుడికి నిర్మించి ఇస్తావా? అనేది తేల్చుకోవాలి. ప్రతి మనిషి విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంసారం, పాండిత్యం... ఇలా ఏది చేసినా అంతిమంగా పొందేదాని కోసం కృషిచేయాలి. అదే కైవల్యం. దాన్నే మోక్షం అంటారు. మనకు కైవల్యాన్ని ప్రసాదించేది పరమ శివుడే. ఆయన కేవలం కేవలహ. అంటే కైవల్యాన్ని ఇచ్చేవాడు అని అర్థం. ప్రతి మనిషి జీవిత లక్ష్యం జనన మరణాలు లేకుండా మోక్షం పొందడమే.












Click it and Unblock the Notifications