ధనుర్మాసం ఎప్పటి వరకు ఉంటుంది.. ఏ దేవున్ని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది..?
డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ ( సంక్రాంతి ముందురోజు ) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి ( అండాళ్ ) మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం.
"మార్గళి త్తింగళ్" మార్గశిర్షం మంచి మాసం, ఫలమును నిచ్చే మాసం. అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే, అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షిణాయణం వారికి రాత్రి అయితే ఉత్తరాయణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంకు మారుతాడు అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెల వారే సమయం. సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని వినియోగించుకోవాలి. "మది నిఱైంద నన్నాళాల్" చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం, చంద్రుడు పెరిగే కాలం కబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం. "నీరాడ ప్పోదువీర్ పోదుమినో" స్నానం చేయటానికి వెల్దాం ! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. "నేరిళైయీర్" భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే.

నారాయణ మంత్రం:- ఈ వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి ఆకాశానికి అంతం లేనట్టుగా, సాగరంలో జలానికి అంతంలేనట్టుగా, మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు. కేవలం ఆయనగుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూదా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు. ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా, అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం.

ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి "విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ". విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు - ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ రెండు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కాని ఎలావ్యాపించి ఉంటాడు , ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనుక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు. కాని నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది , వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది , ఎందుకు వ్యాపించి ఉంటాదని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాదని తెలియజేస్తుంది , ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది.

నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం, నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం , విడ దీస్తే ఉత్తర - అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాన్ని అర్థం ఆధారం. ఈ సకల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు , లోపల - బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి సమాసాలు. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు , ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రిహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది.
అర్థాత్ ఆయన లోపన మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి , చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు , పైన కూడా ఉంటాడు కనక అయన పరుడు - అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటాడు. చేయిజాస్తే అందేవాడు , వారిలోని దోశాలనను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు , దోశాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు. దోశాలను తొలగించే శక్తి కూదా ఉంది. అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది , సౌశీల్యం ఉంది , వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది , వీటి యొగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది, తను ఇలాచేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది, ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది.
అన్ని గూణాలు కల్గి ఉన్న ఈ మత్రాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఊపాస్య మంత్రంగా అందించింది. ఈ పాటలో ఆత్మ ఉజ్జీవనానికి చేయాల్సిన కార్యక్రమం ఏమిటో తెలియజేస్తుండి. శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు , శారీరక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి , కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు. ఆండాళ్ తల్లి అందరితో కలిసి నారాయణ మంత్రంతో ముందుకు వెళ్ళుదాం అంటోంది, దీనికి యోగ్యత కేవలం కోరిక మాత్రం చాలు అని ధైర్యం చెబుతోంది.
పాశురాల పరమార్ధం :-
తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని , చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని , పంటలు నిండుగా పండుతాయని , దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది.
తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు , అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు , రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది.
చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.












Click it and Unblock the Notifications