Diwali 2022: దీపావళి లక్ష్మీపూజ సమయం, పూజా విధానమిదే; పూజలో దీన్ని అసలు మర్చిపోకండి!!
నేడే దీపావళి పండుగ. అందరి జీవితాల్లో వెలుగులు నింపే వెలుగుల పండుగ దీపావళిని హిందువులు అందరూ ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఇక నేడు ప్రతి ఇంట్లోనూ విశేషంగా జరుపుకునే దీపావళి పండుగకు సంబంధించి లక్ష్మీ పూజకు సంబంధించి అనేక విషయాలను తెలుసుకుందాం.
దీపావళి లక్ష్మీ పూజకు వీటిని సిద్ధం చేసుకోండి
దీపావళి పండుగకు లక్ష్మీపూజ చేయదలచుకున్నవారు ఉదయమే ఇల్లంతా శుభ్రం చేసుకొని, మామిడి తోరణాలు, పూలతో ఇల్లంతా అలంకరించి పూజా ద్రవ్యాలను సిద్ధం చేసుకోవాలి. పూజకు కావలసిన పసుపు, కుంకుమ, అక్షంతలు, అగరబత్తీలు, కర్పూరం, మట్టి దీపం, దూది, కలువ పూలు, తేనె, బెల్లం, పెరుగు, నీరు, నైవేద్యం వెండి నాణేలు, పండ్లు తదితరాలను సిద్ధం చేసుకోవాలి. సహజంగా దీపావళి లక్ష్మీ పూజ ప్రదోషకాలంలో నిర్వహిస్తారు. సాయంత్రం సమయంలో లక్ష్మి పూజ నిర్వహిస్తారు కాబట్టి, అమ్మవారి పూజకు సంబంధించిన అన్నింటినీ ముందే సిద్ధం చేసుకోవాలి.
లక్ష్మీ పూజా విధానం ఇలా
నేడు సాయంత్రం 05:42 కు ప్రదోషకాలం ప్రారంభమై 07:31కి ముగుస్తుంది కాబట్టి అందరూ చక్కగా ముస్తాబై లక్ష్మీదేవి పూజకు ఉపక్రమించాలి. ఈ సమయంలో కలశస్థాపన చేసి లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాలి. లక్ష్మీ పూజకు కలశస్థాపన చేయడానికి బంగారం వెండి లేదా రాగి పాత్రను కలశంగా పెట్టుకోవచ్చు. ఆ కలశంలో మూడు భాగాలు నీటిని పోసి మామిడి ఆకులను వేయాలి. ఆపై లక్ష్మీదేవిని ప్రతిష్టించే పీఠంపై బియ్యాన్ని పోసి కలువ పువ్వులతో పాటు లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఇక కలశాన్ని పసుపు. కుంకుమలతో అలంకరించి ముందే సిద్ధం చేసుకున్న నాణేలను అమ్మవారి ముందు పెట్టాలి.
లక్ష్మీదేవితో పాటు గణేశుడికి, కుబేరుడికి, గోమతీ చక్రానికి పూజలు
శక్తికొలది అమ్మవారి ముందు బంగారం, వెండి, ముత్యాలు, నాణాలను సమర్పించి అమ్మవారిని పూజించవచ్చు. పసుపు, కుంకుమ, పూలు తదితరాలతో పూజలు నిర్వహించి, ధూపాన్ని, దీపాన్ని సమర్పించి ముందే తయారు చేసి పెట్టుకున్న నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి. లక్ష్మీదేవిని పూజించే సమయంలో గోమతీ చక్రానికి, గణేశుడికి, కుబేర యంత్రాలకు పూజలు నిర్వహించాలి. మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
లక్ష్మీ పూజలో శంఖంతో శుభ ఫలితం.. లక్ష్మీపూజతో ఫలితమిదే
ఇక లక్ష్మీదేవి పూజలో ప్రధానంగా శంఖాన్ని అసలు మర్చిపోవద్దని అంటున్నారు. లక్ష్మీ పూజలో శంఖాన్ని పెడితే శుభఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఇలా లక్ష్మీదేవిని పూజించడం వల్ల దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, లక్ష్మీదేవి కలకాలం ఇంట్లో ఉంటుందని విశ్వసిస్తారు. అందుకే నేడు లక్ష్మీదేవి పూజను శాస్త్రోక్తంగా, సముచిత మంత్రాలతో, త్రికరణశుద్ధిగా నిర్వహించుకొని ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందండి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.