రేపే చంద్ర గ్రహణం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5న ఏర్పడనుందని జ్యోతిష్య నిపుణులు తెలిపారు. అయితే ఇది భారతదేశంలో కనిపించదు. విదేశాల్లో నివసించే భారతీయులు మాత్రమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. గ్రహణాన్ని కొన్ని రాశులవారు చూడటం మంచిదికాదని అశుభమని చెప్పారు. ఏయే రాశులవారు గ్రహణాన్ని చూడకూడదు.. ఒకవేళ చూస్తే ఎటువంటి దోష నివారణ పద్ధతులు అవలంబించాలో తెలుసుకుందాం.
గ్రహణ సమయంలో చేయకూడని పనులు
* గర్భిణీలు ఇంటి నుండి బయటకు రాకూడదు.
* గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు.
* గ్రహణ కాలంలో పూజలకు దూరంగా ఉండాలి.
* కూరగాయలు తరిమేందుకు కత్తి వంటి సాధనాలను దూరంగా ఉంచాలి.
* గ్రహణ సమయంలో కోపానికి దూరంగా ఉండాలి.
* ఎవరిపైనైనా కోపం తెచ్చుకుంటే రాబోయే 15 రోజులు ఇబ్బంది కలుగుతుంది.
* గ్రహణ సమయంలో స్మశానం, నిర్జన భూమివైపు వెళ్లకూడదు.
* గ్రహణ సమయంలో భార్యాభర్తలు శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి.

గ్రహణం ఏయే రాశులవారికి మంచిది కాదంటే..
ధనస్సు రాశి
గ్రహణం పూర్తయిన వెంటనే ఈ రాశి వారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి దీపం వెలిగించాలి. ఇలా చేయకపోతే ఒక సంవత్సరం అంతా శని మీ నట్టింట తాండవిస్తుందని పండితులు చెబుతున్నారు.
సింహరాశి
గ్రహణం పూర్తయిన వెంటనే సింహ రాశివారు సమీపంలోని పాము పుట్ట వద్దకు వెళ్లి పంచదార వేసి కొబ్బరికాయ కొట్టాలి. అనంతరం 1 ప్రదక్షిణలు చేయాలి లేకపోతే ఈ సంవత్సరం భారీ ధన నష్టం వచ్చే అవకాశం ఉంది.
కన్యా రాశి
గ్రహణం పూర్తయిన తర్వాతరోజు శివాలయానికి వెళ్లి, కొబ్బరికాయ కొట్టి కర్పూరంతో దీపం వెలిగించాలి. అనంతరం పంచాక్షరి మంత్రం పఠించాలి. లేదంటే ఈ సంవత్సరం చాలా కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
మీన రాశి
గ్రహణం పూర్తయిన తెల్లవారే ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి మినప్పప్పు తో చేసిన వడలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావు.
చంద్ర గ్రహణం రోజు చేయాల్సిన పరిహారాలు
* తులసి ఆకులను నోటిలో వేసుకుని చంద్రుని బీజ మంత్రం లేదా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. గ్రహణ సమయంలో ఈ మంత్రాలను జపించడం వల్ల ఎంతో శ్రేయోదాయకం. గ్రహణం వల్ల ఏర్పడే చెడు ప్రభావం తొలగిపోయి జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుంది.
* ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు గ్రహణం తర్వాత ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. మంచినీటిలో కొంచెం గంగాజలం కలిపి ఆహారం తీసుకోవాలి. దీనివల్ల పేదరికం నుంచి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి.
* అన్నం, పాలు, పెరుగు, తెల్లని వస్త్రం, మిఠాయిలు.. తదితర తెల్లటి వస్తువులను దానం చేయడం శుభప్రదంగా చెబుతారు.
* వ్యాపారం పెరిగేందుకు లక్ష్మీదేవి విగ్రహం లేదంటే ఫొటో దగ్గర గోమతీ చక్రాన్ని ప్రతిష్టించాలి. పాలతో శుద్ధి చేసి దానిపై చందనం రాయాలి. పూజ అనతరం పసుపుగుడ్డలో కట్టి వ్యాపారం చేసే చోట భద్రంగా దాయాలి.
* తీపి అన్నాన్ని ఇంట్లో స్వయంగా తయారుచేసి కాకులకు తినిపించాలి. కార్యాలయంలో ఎదురయ్యే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. దీనివల్ల శని, రాహువు, కేతువు దోషాలు కూడా తొలగిపోతాయి.
* ఆటంకాలు తొలగిపోయేందుకు గ్రహణం సమయంలో గేటుకు తాళం వేయాలి. తర్వాతరోజు ఆ తాళం తీసుకొని ఏదైనా ఆలయానికి విరాళంగా ఇవ్వాలి. దీనివల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications