క్లాసులో టీచరుంటారు... జీవితంలో ఎవరుంటారు?
సాధారణంగా మనందరికీ గురువుగారు అంటే పాఠాలు చెప్పే టీచరుగారో, మాస్టరుగారో అనుకుంటాం
విద్యనభ్యసించే సమయంలో మన చదువుచెప్పే మాస్టరుగారు, టీచరుగారే మనకు గురువుగా భావిస్తాం. పాఠశాలలో చదివినా, కళాశాలలో చదివినా ఆ గురువులతో బంధం అంతవరకే ఉంటుంది. కళాశాల నుంచి బయటకు వచ్చి ఉద్యోగమో, వ్యాపారమో చేస్తూ, వివాహం చేసుకొని సంసార బంధంలో అడుగుపెడుతుంటాం. ఇవన్నీ జీవితంలో చోటుచేసుకునే ముఖ్యమైన ప్రక్రియలు. క్లాస్ రూంలో గురువున్నట్లే మన జీవితం మొత్తానికి కూడా ఒక గురువు ఉండాలి. ఆయన్ని ఆలంబనగా చేసుకొని సంసార సాగరమనే సముద్రాన్ని సులువుగా దాటాలి.

అజ్ఞానులను గురువుగా ఎంచుకోవద్దు..
సాధారణంగా మనందరికీ గురువుగారు అంటే పాఠాలు చెప్పే టీచరుగారో, మాస్టరుగారో అనుకుంటాం. కానీ జీవితం మొత్తానికి కూడా ఒక గురువుండాలనే విషయాన్ని తెలుసుకోనివారే ఎక్కువగా ఉంటారు. అంటే వారంతా అజ్ఞానంలో ఉన్నట్లుగా భావించాలి. జీవితానికి ఒక గురువు ఉండాలి అనే అవగాహన మనకు కలిగిన తర్వాత గురువును ఎంచుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవర్ని పడితే వారిని, అర్హత లేనివారిని, అజ్ఞానులను గురువుగా ఎంచుకుంటే అంతిమంగా మనకే నష్టం కలుగుతుంది.

పరమ శివుడే ఆదిగురువు
ఆది గురువు అంటే ఎవరు?.. పరమ శివుడు. నాకు మంచి గురువు కావాలి.. సద్గురువును చూపించు అని భగవంతుణ్ని వేడుకోవాలి. ఆయన కృపా కటాక్షాలతోనే మనకు సద్గురువు లభిస్తాడు. గురువుకు, సద్గురువుకు ఉన్న తేడా ఏమిటి? అంటే నకిలీ గురువుల చుట్టూ ఎంత ఎక్కువ సంఖ్యలో ప్రజలు పోగైతే వారికి అంత గొప్ప. కానీ సద్గురువులు హంగు, ఆర్భాటం కోసం వెంపర్లాడరు. తమకు పేరు ప్రతిష్టలు రావాలని కోరుకోరు. సద్గురువుల సాన్నిధ్యంలో ఎల్లప్పుడూ ఆనందం వెల్లివిరుస్తుంటుంది. ప్రజలు కూడా ఆ ఆనందంలో పాలుపంచుకుంటారు. కపట సన్యాసులు, సాధువులు, గురువులు తమకేగాక తమ చుట్టూ ఉన్న సమాజానికి కూడా హాని చేస్తుంటారు. నకిలీ గురువులు చేసే మాయలు ప్రజలన్ని ఇంకా మాయలోకి నెడుతుంటాయి.

జీవితమంతా గోతుల మయంగా ఉంటుంది
జీవితమంతా గోతుల మయంగా ఉంటుంది. అన్నీ ముళ్లపొదలే ఉంటాయి. ఈ పొదలను తప్పించుకుంటూ, గోతుల్లో పడకుండా సావధానంగా మనం ఒడ్డుకు చేరుకోవాలి అంటే సద్గురువు అవసరం. కానీ మనకు ఎంత నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని బట్టి పలితం లభిస్తుంటుంది. విశ్వాసో ఫలదాయ: అంటారు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు రావల్సిన ఫలితం ఆధారపడివుంటుంది. సద్గురువుకు కావల్సింది నమ్మకమే. ఆ నమ్మకాన్ని ధృఢపరచాల్సిందిగా ఆ సదర్గురువునే మనం కోరుకోవచ్చు. విశ్వాసం బలపడేందుకు, నమ్మకం పూర్తిస్థాయిలో ఉండేందుకు కొన్ని పరీక్షలు ఉంటాయి. వాటిని గెలవగలిగితే చాలు. జీవితానికి ఆవలివైపు ఉన్న పరమానందం అంతా మన సొంతమవుతుంది. అది కేవలం గురువు కృప మీదే ఆధారపడివుంటుంది. భగవంతుడైనా సద్గురువు దగ్గర అణకువగా ఉంటాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రామకృష్ణ పరమహంస మోక్షం కావాలి అని దేవతను అడిగితే ఆమె గురువును సేవించమని చెబుతుంది. తర్వాత ఆయన గురువును ఆశ్రయించి, ఆయనకు సేవ చేసుకొని మోక్షాన్ని పొందుతారు. కాబట్టి సర్వం గురు కృప అనే విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు.












Click it and Unblock the Notifications