జయ ఏకాదశి నాడు ఈ పని చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం పక్కా..
హిందూ మతంలో జయ ఏకాదశికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. ఇక ఈ ఏడాది ఈ ఫిబ్రవరి 8వ తేదీన జయ ఏకాదశి రానుంది. ఆ రోజున ఉపవాస దీక్షను ఆచరించి శ్రీ మహా విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలని వేద పండితులు సూచిస్తున్నారు. ఈ రకంగా చేయడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతుంటారు. అయితే జయ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని.. కొన్ని పరిహారాలు పాటిస్తే శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..
తులసి పూజ..
జయ ఏకాదశి రోజు శ్రీ హరితో పాటు తులసిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి.. ఓం విష్ణువే నమః అనే మంత్రాన్ని జపించాలని సూచిస్తున్నారు. ఈ పరిహారం పాటించడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, సానుకూల శక్తి పెరుగుతుందంటున్నారు.

నైవేద్యం సమర్పణ..
జయ ఏకాదశి వేళ శ్రీహరికి పసుపు రంగులో ఉండే పండ్లను సమర్పించాలని అంటున్నారు. అరటిపండు, మామిడి పండు వంటివి పెడితే మంచిది. ఆ విధంగా సమర్పించడం వల్ల సంపద పెరుగుతుందని.. జాతకంలో కూడా గురు స్థానం బలపడుతుందని సూచిస్తున్నారు. అయితే ఉపవాస దీక్ష చేసేవారు మాత్రం పసుపు రంగు పదార్థాలను తినకూడదని చెబుతున్నారు.
ధర్మం చేయడం..
జయ ఏకాదశి వంటి పవిత్రమైన రోజును పేదలకు దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారని సూచిస్తున్నారు. ధాన్యం, బట్టలు, పండ్లు, బెల్లం, నువ్వులు వంటివి ఇవ్వొచ్చని అంటున్నారు.
విష్ణు మంత్రం స్మరించడం..
ఇక ఆ రోజున రాత్రంతా మేల్కొని, విష్ణు మంత్రాలను, స్తోత్రాలను పఠించాలని పండితులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక శాంతి పెరుగుతుందని.. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయని అంటున్నారు. ఈ విధంగా చేస్తే కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారని వెల్లడిస్తున్నారు.












Click it and Unblock the Notifications