లడ్డూ ప్రసాదంపై భక్తులకు టీటీడీ శుభవార్త
తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన జె.శ్యామలరావు దేవస్థానం పరిధిలోని అన్ని విభాగాలను తనిఖీ చేస్తున్నారు. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించి వాటిని సరిచేసుకోవాల్సిందిగా అధికారులకు సూచిస్తున్నారు. తాజాగా ఆయన పోటును తనిఖీ చేసి అధికారులకు, కార్మికులకు కీలక సూచనలు చేశారు. లడ్డూ ప్రసాదంలో యాలకులు, శనగపిండి, నెయ్యి ఎక్కువగా ఉపయోగించి కొన్ని లడ్డూలను శాంపిల్ గా తయారుచేసి వాటి నాణ్యత ఎలా ఉందో పరిశీలించాలని సూచించారు.
లడ్డూలపై ఎందుకు విమర్శలు వస్తున్నాయి?
లడ్డూలపై విమర్శలు రావడానికి కారణమేంటని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. పని భారం పెరుగుతోందని, అదనపు సిబ్బందిని నియమించాలని వారు ఈవోకు విన్నవించారు. టెండర్ల ప్రకారం ఎవరు తక్కువ ధరకు ఇస్తే వారిదగ్గర సరుకులు తెప్పిస్తున్నామని అధికారులు ఈవోకు చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాభిషేకం ముగిసింది. చివరిరోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో కనిపించారు. ఏడాది పొడవునా మళ్లీ జ్యేష్టాభిషేకం వచ్చేవరకు స్వామివారు, అమ్మవారు ఈ బంగారు కవచంతో దర్శనమిస్తారు.

పండగలా జరిగిన స్వర్ణ కవచ సమర్పణ
శ్రీ మలయప్పస్వామివారు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. వేద పారాయణదారులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు శతకలశ తిరుమంజనం జరిగింది. అనంతరం బంగారు కవచాలకు ప్రత్యేక పూజలు జరిగాయి.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి సాయంత్రం వేళ స్వర్ణ కవచ సమర్పణ పండగలా జరిగింది. సహస్రదీపాలంకరణ సేవ అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, జేఈవో వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు












Click it and Unblock the Notifications