vastu tips: ఏ దానం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? తెలుసుకోండి!!
దానాలు చేయడం వల్ల ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని వాస్తు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దానాలు అన్నిటిలోకి గొప్ప దానం ఏమిటి? ఎటువంటి దానాలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? వంటి అనేక విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుడ్ని దానం యొక్క గొప్పతనం ఏమిటి? ఏ దానాలు వల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయి? అని ప్రశ్నించగా శివుడు పార్వతి దేవితో దానాల గురించి ఏం చెప్పారంటే..
ముఖ్యంగా అతిథులకు అన్నము, నీరు ఇచ్చి తృప్తి పరిచే వారికి స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయని చెప్పారు . అన్నిటిలోకి అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం కంటే గొప్ప పని ప్రపంచంలో ఏదీ లేదని పరమేశ్వరుడు పార్వతికి చెప్పారు. దానం చేసినవారికి సద్గతులు ప్రాప్తిస్తాయని, అన్నము, నీరు అన్ని జీవులకు ప్రాణాధారము కాబట్టి దానం చేయవలసిన వస్తువులలో అతి ముఖ్యమైనవి ఇవి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా పురాణాలలోనూ ఉంది.
బంగారాన్ని ఎవరైనా దానం చేస్తే కూడా మంచి జరుగుతుందని బంగారు అగ్నితో సమానం కాబట్టి బంగారాన్ని దానం చేయడం అగ్నిని దానం చేయడంతో సమానమని శివుడు పార్వతికి చెప్పారు. ఇక దానాలలో తర్వాత గో దానానికి దక్కుతుందని, గోవును బ్రాహ్మణులకు దానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోక సుఖాలు ప్రాప్తిస్తాయని చెప్పారు మహా శివుడు.
కపిల గోవును దానం చేస్తే 21తరాల పితరులు స్వర్గానికి వెళ్తారని చెప్తున్నారు. ఆ తర్వాత దానాలలో ముఖ్యమైనది భూ దానము. భూదానం చేస్తే భూమి ఉన్నంత కాలం స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయని పరమేశ్వరుడే చెప్పారు. భూమి లోపల సకలసంపదలు ఉంటాయి. కాబట్టి భూమిని దానం చేసిన వారికి సకల సంపదలను తిరిగి పొందుతారని చెబుతున్నారు.
ఆ తర్వాత దానాలలో గొప్ప దానం కన్యాదానం. కన్యాదానం చేస్తే యమధర్మరాజు ప్రీతి చెందుతాడు అని, కన్యా దానం చేసిన వారికి తేజస్సు యశస్సు కలుగుతాయి అని చెబుతారు.ఆ తర్వాత దానాలలో ముఖ్యమైనది విద్యాదానం. అయితే విద్యాదానం మాత్రం అర్హులకు మాత్రమే చేయాలని విద్యా దానం చేసిన వారికి శాశ్వతంగా స్వర్గలోకం ప్రాప్తిస్తుందని చెబుతున్నారు.
బట్టలు దానం చేస్తే అన్ని పీడల నుండి విముక్తి, ఎవరినైనా జల ప్రవాహాలను దాటిస్తే మన దుఃఖం తొలగిపోవడం, రహదారుల పక్కన బాటసారులకు సత్రాలు కట్టించి ఆశ్రయం కల్పిస్తే సకల శుభాలు చేకూరుతాయని చెబుతున్నారు. అందుకే దానాలు సర్వశ్రేష్టం అని పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్టు పురాణాలలోనూ కనిపిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.