దేశంలో కృష్ణుడు కొలువుదీరిన ప్రధాన ఆలయాలు- కృష్ణతత్వానికి ప్రతిబింబాలు జీవితంలో ఒక్కసారైనా
నేడు.. శ్రీకృష్ణ జన్మాష్టమి. పురాణాల ప్రకారం.. భాద్రపద మాసంలో కృష్ణ పక్ష బహుళ అష్టమి తిథి నాడు కృష్ణ పరమాత్ముడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈ వేడుకలను కృష్ణాష్టమి, గోకులాష్టమిగా దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కృష్ణాష్టమి మరుసటి రోజు ఉట్టి కొట్టే సంబరాలు మిన్నంటనున్నాయి. భగవద్గీత ద్వారా మానవాళికి దిశానిర్దేశం చేసిన కృష్ణ పరమాత్ముడిని పూజించడానికి దేశవ్యాప్తంగా ఉన్న పురాతన ఆలయాలకు భక్తులు దర్శించుకుంటోన్నారు.
వాటిల్లో కొన్ని ఆలయాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భావిస్తుంటారు కోట్లాదిమంది. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక ఒడిదొడుకులను అధిగమించడానికి శ్రీకృష్ణుడి భగవద్గీత బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని సమస్త మానవాళి గట్టిగా నమ్ముతుంది.

కృష్ణుడి జన్మస్థలం.. ఉత్తరప్రదేశ్ లోని మధుర. కృష్ణ జన్మభూమిగా అలరారుతోంది. జన్మాష్టమి రోజున అశేష జనావళితో పులకించిపోతోంది. మధుర సమీపంలో ఉన్న పుణ్య క్షేత్రం బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం, అద్భుతమైన శిల్పకళా కట్టడమైన ప్రేమ్ మందిర్ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఇక్కడ జరిగే ప్రత్యేక పూజా విధానాలు దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోన్నాయి.
గుజరాత్ తీరంలో ఉన్న ద్వారకాధీష్ ఆలయం చార్ ధామ్ యాత్రలలో ఒకటి. శ్రీకృష్ణుడిని ద్వారకాధీశుడిగా ఇక్కడ భక్తులు కొలుస్తుంటారు. దీనితో పాటు రాజస్థాన్ లోని నాథ్ద్వారా ప్రాంతంలో వెలసిన ప్రసిద్ధ శ్రీనాథ్జీ ఆలయం, జైపూర్ సిటీ ప్యాలెస్ ప్రాంగణంలో ఉన్న గోవింద్ దేవ్ జీ ఆలయం కృష్ణాష్టమి సంబరాలకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ స్వామివారికి సమర్పించే రాజ్ భోగ్, మంగళ హారతిని వీక్షించడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు.
దక్షిణాదిన కేరళలోని గురువాయూర్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని దక్షిణ ద్వారకగా పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని గురువాయూరప్పన్ రూపంలో పూజిస్తారు. కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ మఠం కూడా ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న విశిష్ట ఆలయం. ఇక్కడ కిటికీ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతి కృష్ణాష్టమి రోజున ఇక్కడ పులివేషాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇవి.. చూడ్డానికి రెండు కళ్లూ చాలవనిపించేలా ఉంటాయి.
బెంగళూరులోని ఇస్కాన్ ఆలయంలో జరిగే కృష్ణాష్టమి సంబరాలు, కీర్తనలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశీ యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఒడిశా పూరి జగన్నాథ ఆలయం కూడా ఈ పండుగ రోజున భక్తులతో కిటకిటలాడుతోంది. జగన్నాథుడిని కృష్ణుడి లీలా రూపంగానే భావించి ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే వార్షిక రథోత్సవం గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు.
దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రముఖ ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలే కాకుండా భారతీయ సంస్కృతి, పురాతన జీవన విధానానికి ప్రతీకలుగా నిలుస్తోన్నాయి. శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరని సనాతన సంప్రదాయానికి అద్దం పడుతున్నాయి. ఈ ఆలయాలలో జరిగే కృష్ణాష్టమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించడం ప్రతి ఒక్కరికీ జీవితకాలంలో మర్చిపోలేని దివ్యానుభూతిని పంచుతుంది. కృష్ణ పరమాత్ముడి అనంత తత్వాన్ని ప్రతిబింబించే ఈ పవిత్ర దివ్య క్షేత్రాలను దర్శించుకోవడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది.













Click it and Unblock the Notifications