లోక్ భవన్ లో గవర్నర్ తో సీఎం రేవంత్ భేటీ.. కొండా సురేఖ బర్తరఫ్ కు గవర్నర్ ఆమోదం
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సును గవర్నర్ శివ ప్రతాప్ ఆమోదించారు. దీంతో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ లోక్ భవన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు ఏఐసీసీ క్లియరెన్స్ ఇచ్చింది. ఇక కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి లోక్ భవన్ కు చేరుకున్నారు.
చంచల్ గూడ-సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన సీఎం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం నేరుగా లోక్ భవన్ చేరుకుని గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ కూడా ఉన్నారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై గవర్నర్ కు వివరించారు. ముఖ్యంగా కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించే అంశంపై గవర్నర్ తో సీఎం రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. ఆమె బర్తరఫ్ కు దారితీసిన పరిస్థితులను గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. అనంతరం సీఎం ఎదురుగానే గవర్నర్ బర్తరఫ్ ఉత్తర్వులపై సంతకం చేసినట్లు తెలిసింది.

అయితే అంతకుముందు కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరినా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ లేఖ రాయడం, దానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదంతో పార్టీలో జరిగిన నాటకీయ పరిణామాలకు తెరపడినట్లు అయింది. ఇక కొండా సురేఖ బర్తరఫ్ తో తెలంగాణ కేబినెట్ లో మూడు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. అయితే ఈ ఖాళీలను ఎవరితో భర్తీ చేయాలన్న అంశంపై గవర్నర్ తో జరిగిన తాజా భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొండా సురేఖ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications