వాస్తు ప్రకారం మీ ఇంట్లో మరణించిన పెద్దల ఫొటోలను ఎక్కడ పెడుతున్నారు?
వాస్తు శాస్త్రం ప్రకారం, మరణించిన పితృదేవతల ఫొటోలను ఇంట్లో ఉంచుకోవడానికి కొన్ని నిర్దిష్టమైన నియమాలు ఉన్నాయి. తప్పుడు దిశలో లేదా తప్పుడు ప్రదేశంలో ఫొటోలను ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి, మనశ్శాంతి కరువయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మానసికంగా ఆందోళన పడతారు. పెద్దల ఫొటోలను గౌరవించాలి. ప్రతి సంవత్సరం వారికి చేయాల్సిన కార్యక్రమాలు చేస్తుండాలి. ఎన్ని సంవత్సరాలైనా దీన్ని వదిలిపెట్టకూడదు. అదే మిమ్మల్ని చివరి దశలో కాపాడుతుంది. అయితే ఏదో చేశామంటే చేశాం అన్నట్లు కాకుండా.. శ్రద్ధగా, గౌరవంగా చేయాలి.
ఇంట్లో మరణించినవారి ఫొటోలను దక్షిణం వైపు పెట్టుకోవడం అత్యంత శుభప్రదం. దక్షిణం వైపు ఉంటే వారు ఉత్తరం వైపు చూస్తుంటారు. ఇది వారి దిక్కు. దక్షిణం వీలుకాకపోతే నైరుతిలో పెట్టండి.మరణించిన వారు ఎంతటి పూజ్యులైనప్పటికీ, వారిని దేవుళ్లతో సమానంగా పూజా గదిలో పెట్టకూడదు. దేవుడి పటాల మధ్య అసలు ఉంచకూడదు. దేవుడు, పితృదేవతలు వేర్వేరు శక్తులు.

పడక గదిలో పెద్దల ఫొటోలు ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తాయి. వంటగదిలో ఫొటోలు పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.ఇంటి లోపలికి రాగానే నేరుగా కనిపించేలా ప్రధాన ద్వారం ఎదురుగా ఈ ఫొటోలను అసలే పెట్టకూడదు.
పెద్దల ఫొటోలను నేలపై లేదా చాలా తక్కువ ఎత్తులో ఉంచకూడదు. గౌరవప్రదమైన ఎత్తులో, అంటే కనీసం కంటి చూపునకు సరి సమానంగా లేదంటే కొంచెం ఎత్తులో పెట్టాలి.దేవుళ్ల పటాలకు దూరంగా, వేరే గోడపై కేవలం పితృదేవతల ఫొటోలే ఉండేలా చూసుకోవడం మంచిది. ఫొటోలు వంకరగా ఉండకూడదు. దుమ్ము పట్టకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
మరణించిన వారి ఫొటోలను ప్రస్తుతం జీవించి ఉన్న కుటుంబ సభ్యుల ఫొటోలతో కలిపి పెట్టకూడదు. ఇది జీవించి ఉన్నవారి ఆయుష్షుపై లేదా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని కొందరు నమ్ముతారు. నిత్యం పూల మాలలు వేసి ఉంచాల్సిన అవసరం లేదు. కేవలం వారి పుట్టినరోజు లేదా వర్ధంతి వంటి ప్రత్యేక రోజుల్లో మాలలు వేసి, నైవేద్యం పెట్టి ధూపదీపాలు సమర్పిస్తే సరిపోతుంది. ఇంట్లో ప్రతి గదిలోనూ పెద్దల ఫొటోలు ఉండకూడదు. ఇంటికి ప్రధానమైన హాల్లో దక్షిణ గోడకు ఉంచడం శ్రేయస్కరం. ఇవి పాటించడంవల్ల ఇంట్లో ప్రశాంతత, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.












Click it and Unblock the Notifications