భారీ వర్షాలు - కొండచరియల బీభత్సం, శిథిలాల కిందే..!!
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగి పడటంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ ఘటన పైన అప్రమత్తం అయింది. వెంటనే సహాయక చర్యలు మొదలయ్యాయి. భారీ వర్షం చర్యలకు ఆటంకంగా మారుతోంది. ముఖ్యమంత్రి సతీశన్ వయనాడ్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
కేరళలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది. వయనాడ్ జిల్లా, మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతోంది.మలప్పురం, వయనాడ్ జిల్లాలను కలిపే సొరంగ రహదారి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో కొండచరియలు విరిగిపడటం తో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఘటనా స్థలికి అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ అధికారులు చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షం రెస్క్యూ ఆపరేషన్స్ కు అడ్డంకిగా మారుతోంది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ కొండ చరియలు విరిగి పడ్డాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు అందుతున్న సమచారం మేరకు అయిదుగురు గాయపడగా.. వారికి చికిత్స అందిస్తున్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు
మీనంగాడిలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకోవాలని సీఎం కార్యాలయం ఆదేశించింది. అదే విధంగా కోజికోడ్ లో ఉండే ఎన్డిఆర్ఎఫ్ బృందాన్ని కూడా వయనాడ్కు తరలించారు. ఘటనతో పాటుగా సహాయక చర్యల పైన జిల్లా కలెక్టర్ తో సీఎం వీడీ సతీశన్ మాట్లాడారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. జిల్లా మంత్రులను ఘటనా స్థలికి వెళ్లి చర్యలను పర్యవేక్షించాలని సీఎం నిర్దేశించారు. వాతావరణం అనుకూలించక సహాయక చర్యల్లో ఆలస్యం జరుగుతుందని... బాధితులకు అండగా నిలుస్తామని ప్రభుత్వం ప్రకటించింది.













Click it and Unblock the Notifications