Dhanurmasam 2021: తిరుప్పావై పాశురాల ఆలపనతో పులకించే మరో పవిత్రమాసం: ఈ నెలలోనే
ఈ ఏడాది కార్తీకమాసం ముగిసింది. శనివారం అమావాస్యతో కార్తీకమాస ఉత్సవాలు ముగిశాయి. మరో పవిత్ర మాసం రాబోతోంది. శ్రీమన్నారాయణుడు, గోదాదేవికి అత్యంత ప్రీతికరమైన నెల. అదే- ధనుర్మాసం. ఈ సంవత్సరం ధనుర్మాసం ఈ నెల 16వ తేదీన ఆరంభం కానుంది. తిరుప్పావై పాశురాలతో నారాయణుడి ఆలయాలు ఆధ్యాత్మికతతో పులకించిపోతుంటాయి. తిరుప్పావై పాశురాలు వినిపించని వైష్ణవాలయాలు బహుశా ఈ ధనుర్మాసంలో ఉండకపోవచ్చు.
ధనస్సు రాశిలో సూర్య భగవానుడు పరిభ్రమించే కాలం ఇది. అందుకే దీనికి ధనుర్మాసంగా పిలుస్తారు. ధనుర్మాసం ముగిసిన తరువాతే ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమౌతుంది. అంటే దక్షిణాయంలో వచ్చే చివరి నెల ధనుర్మాసం అవుతుంది. కార్తీక మాసంతో సమానంగా దీనికి ప్రాధాన్యత లభించడానికి ప్రధాన కారణం కూడా ఇదే. ధనుర్మాసం ముగిసిన తరువాత ఉత్తరాయన పుణ్యకాలం మొదలవుతుంది. శ్రీమహా విష్ణువుకు ప్రీతికరమైనదిగా చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు.
కార్తీకమాసం తరహాలోనే ధనుర్మాసంలో కూడా అన్ని ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనది కావడం వల్ల వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేవారు ధనుర్మాస వ్రతాలను నిర్వహిస్తుంటారు. గోదాదేవిని పూజిస్తారు. పాశురాలతో నిత్యపూజలు, నైవేద్యాలు, కైంకర్యాలను అర్పిస్తుంటారు. ఈ మాసంలో వైష్ణవ ఆలయాలను సందర్శించడం చాలా పుణ్యఫలమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు.
వైష్ణవాలయాల్లో ఆండాళ్ పూజలు నిర్వహించడం, తిరుప్పావై పాశురాలను పఠించడం, గోదాదేవి కల్యాణాన్ని జరిపించడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలను ఆలపిస్తారు. వాటితోనే శ్రీవేంకటేశ్వరస్వామివారికి పూజలు చేస్తారు. ధనుర్మాసంలో తెల్లవారు జామున, సాయంత్ర సమయాన దీపారాధన చేయడం వల్ల సాక్షాత్ శ్రీమహావిష్ణువు..మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు పెద్దలు.
తిరుప్పావై పాశురాలను భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధంగా భావిస్తారు. శ్రీమహావిష్ణువును పూజించే సమయంలో గోదాదేవి ఈ తిరుప్పావై పాశురాలను గానం చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. తిరుప్పావైలోని పాశురాలను రోజుకొకటి చొప్పున ఈ ధనుర్మాసం ముగిసే వరకూ గానం చేస్తారు. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి ప్రధాన ఆలయం ఉంది. అక్కడ అమ్మవారు తులసీ మొక్కల మధ్య దర్శనమిచ్చినట్లు చెబుతారు.