బీజేపీతో కుమారస్వామి దోస్తీ..? యడియూరప్పకు ఊరట, కర్నాటక రాజకీయాల్లో ఏం జరుగుతోంది..?
రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్కు మద్దతు పలకిన మరుసటి రోజే జేడీఎస్ యూటర్న్ తీసుకుంది. అయితే ఇందుకు సరైన వివరణ ఇవ్వలేదు. అయితే దీనిపై జేడీఎస్ అధినేత కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక అంతకంటే ముందు కర్నాటక అసెంబ్లీలో రైతు సవరణ బిల్లు తీసుకొచ్చినప్పుడు కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్ పార్టీ మద్దతు తెలిపింది. దీంతో ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. రైతు పార్టీగా చెప్పుకునే జేడీఎస్ బీజేపీకి మద్దతు తెలిపి అందరినీ షాక్కు గురిచేసింది. అయితే దేవె గౌడ కుమార స్వామిల ప్రణాళిక వేరుగా ఉన్నట్లు సమాచారం.
యూటర్న్ నేతగా కుమారస్వామికి గుర్తింపు
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ అధినేత కుమార స్వామి యూటర్న్లకు పెట్టింది పేరు. ఇప్పుడనే కాదు గతంలో కూడా చాలా సార్లు యూటర్న్ తీసుకున్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. తాజాగా కుమార స్వామి బీజేపీకి దగ్గరయ్యేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్థం అవుతున్నాయి. గతేడాది తన ప్రభుత్వం కూలిపోయేందుకు కారణం కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యే అని భావిస్తున్న కుమార స్వామి క్రమంగా బీజేపీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. సిద్దరామయ్య కూడా అదే స్థాయిలో కుమారస్వామిపై మండిపడ్డారు. కుమార స్వామి లీడర్ కాదని తానొక డీలర్ అంటూ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం జేడీఎస్ క్యాడర్ కుమారస్వామి నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఇక జరుగుతున్న డెవలప్మెంట్స్ పై జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా నోరుమెదపడం లేదు అదే సమయంలో కుమారస్వామికి మద్దతుగా నిలుస్తున్నట్లు కూడా చెప్పడం లేదు.
జేడీఎస్ను వీడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధం
ఇక కర్నాటక రాజకీయాలపై అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ పై ఆ పార్టీ చీఫ్ దేవెగౌడ కూడా మౌనం వహిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్తో టచ్లో ఉండగా... కుమార స్వామి బీజేపీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారని కొందరు జేడీఎస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు డజన్ మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయానికల్లా జేడీఎస్ నుంచి జాతీయ పార్టీలకు వెళ్లే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చాలామంది ఉపఎన్నిక ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అందుకే ఇప్పటికిప్పుడు జాతీయ పార్టీల్లో చేరకపోయినా... భవిష్యత్తులో మాత్రం జేడీఎస్ను వీడి కాంగ్రెస్ బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జేడీఎస్కు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
డీకే శివకుమార్తో టచ్లోకి వస్తున్న జేడీఎస్ ఎమ్మెల్యేలు
దేవెగౌడ కుటుంబం పాలన, పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు, స్థిరంగా లేని నిర్ణయాలతో చాలామంది జేడీఎస్ నేతలు, నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం జేడీఎస్ కురవృద్ధుడు దేవె గౌడకు 87 సంవత్సరాలు వచ్చాయి కనుక తాను పార్టీని నడిపే పరిస్థితుల్లో లేరని, ఇక ఆయన కొడుకులు అయిన కుమార స్వామి, రేవన్న గౌడ్లు కూడా పార్టీని నడిపిస్తారనే నమ్మకం జేడీఎస్ నాయకులు కోల్పోయారని ఓ నేత చెప్పారు. ఇక కాంగ్రెస్ చీఫ్గా ఉన్న డీకే శివకుమార్ కూడా పాతమైసూరు ప్రాంతంకు చెందిన వారు కావడం, ఒక్కలిగా సామాజిక వర్గంకు చెందిన వారు కావడంతో చాలా మంది ఆ సామాజిక వర్గంకు చెందిన జేడీఎస్ కార్యకర్తలు నేతలు నాయకులు శివకుమార్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని నాయకులు వాపోతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే జేడీఎస్ ఇక ఎప్పటికీ కోలుకోలేదని చెప్పిన ఆ నాయకుడు... అందుకే కుమార స్వామి బీజేపీకి దగ్గరయి తన వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పెద్దగా చింత లేదని అయితే డీకే శివకుమార్ గెలవకూడదని మాత్రమే కుమారస్వామి పనిచేస్తున్నారని జేడీఎస్కు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్సీ వెల్లడించారు.
ప్రస్తుతం యడియూరప్పకు రిలీఫ్
ప్రస్తుతం జేడీఎస్లో జరుగుతున్న పరిణామాలతో కర్నాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప చాలా సంతోషంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు తన కుర్చీని కాపాడుకునేందుకు అంతర్గతంగా చాలా పోరాడుతున్నారు. ఈ సమయంలో జేడీఎస్ బీజేపీకి దగ్గరవుతుండటం ఆయనకు భారీ ఊరటనిచ్చే విషయం అని అనలిస్టులు భావిస్తున్నారు. ఇక కర్నాటకలో అధికార పార్టీలో క్రమంగా తలెత్తుతున్న సమస్యలపై హైకమాండ్ కూడా ఇప్పుడప్పుడే స్పందించేందుకు సిద్ధంగా లేదని సమాచారం. దీంతో యడియూరప్ప కూడా సేఫ్ అయినట్లు భావిస్తున్నారు. మొత్తానికి యూటర్న్లకు బాగా అలవాటు పడిపోయిన జేడీఎస్... మరోసారి యూటర్న్ తీసుకుని కర్నాటకలో రాజకీయ సమీకరణాలు మారుస్తుందా లేదా అనేది తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.