Lal Bahadur Shastri:జై జవాన్-జైకిసాన్తో పాటు ఆయన ఇచ్చిన 10 బలమైన స్లోగన్లు ఇవే..!!
లాల్ బహదూర్ శాస్త్రి 2 అక్టోబర్ 1904 న ఉత్తర ప్రదేశ్లో జన్మించారు. అతను జవహర్లాల్ నెహ్రూ తర్వాత భారతదేశానికి రెండవ ప్రధాన మంత్రి అయ్యాడు. గుజరాత్లోని ఆనంద్ యొక్క అమూల్ మిల్క్ కో-ఆపరేటివ్ సొసైటీకి మద్దతు ఇవ్వడం ద్వారా మరియు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ను సృష్టించడం ద్వారా అతను పాల ఉత్పత్తి మరియు సరఫరాను పెంచే దిశగా-శ్వేత విప్లవాన్ని ప్రోత్సహించారు. భారతదేశ ఆహార ఉత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన శాస్త్రి 1965 లో భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రోత్సహించారు. ఇది ముఖ్యంగా పంజాబ్, హర్యానా మరియు ఉత్తర ప్రదేశ్లో ఆహార ధాన్యం ఉత్పత్తి పెరగడానికి దారితీసింది.
ఈ సంవత్సరం అక్టోబర్ 2 న, మహాత్మాగాంధీ 152 వ జయంతితో పాటు, లాల్ బహదూర్ శాస్త్రి 117 వ జయంతి కూడా జరుపుకుంటారు. భారతదేశ చరిత్రలో గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి ఇద్దరి సహకారం అమూల్యమైనది. సంవత్సరం భిన్నంగా ఉన్నప్పటికీ, ఇద్దరూ ఒకే తేదీన జన్మించడం యాదృచ్చికమే. గాంధీజీ లాగానే లాల్ బహదూర్ శాస్త్రి అభిప్రాయాలు కూడా చాలా అమూల్యమైనవి. ఇక లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన 10 నినాదాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం.
1965లో భారత్-పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధం సందర్భంగా అప్పటి ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ఓ నినాదం ఇచ్చారు. అదే జై జవాన్ జై కిసాన్. అంటే దేశ రక్షణకు జవాన్ ఎంత ముఖ్యమో... దేశం ఆకలి తీర్చడంలో రైతు పాత్ర కూడా అంతే ముఖ్యంగా ఉంటుందని చెప్పారు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి అంటే అందరికీ ఈ పాపులర్ స్లోగన్ గుర్తుకొస్తుంది. అంతేకాదు యుద్ధం సమయంలోనే ఈ నినాదం ఇచ్చి భారత జవాన్లలో ఉత్సాహాన్ని నింపారు. దీంతో పాటు ప్రేరణ కల్గించే ఎన్నో నినాదాలు శాస్త్రి ఇచ్చారు.
1."హింస అనేది మా విధానం కానే కాదు. ఏ సమస్య వచ్చినా దాన్ని శాంతియుత వాతావరణంలోనే పరిష్కరించుకుంటాం.మేము అహింసను బలంగా నమ్ముతాం. యుద్ధం మా విధానం కాదు.. శాంతియుత వాతావరణంలోనే దానికి చరమగీతం పాడుతాం. ముఖ్యంగా అణు యుద్ధానికి భారత్ చాలా దూరం " అని ఒకానొక సందర్భంలో శాస్త్రి అన్నారు.
2. "క్రమశిక్షణ, ఏకత్వం అనే రెండు అంశాలు దేశానికి నిజమైన బలం"
3. "భారత దేశ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్శీలతో పాటు ఇతర మతస్తులు కూడా జీవిస్తున్నారు. దేవాలయాలు, చర్చీలు, మసీదులు, గురుద్వారాలు ఉన్నాయి. అయితే వీటన్నిటినీ రాజకీయాల్లోకి తీసుకురాం. ఇదే భారత్కు పాకిస్తాన్కు ఉన్న తేడా"
4. "ప్రమాదాలు పొంచి ఉన్నాయని తెలిసి కూడా బెదరకుండా కలిసే ఉంది భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలుపుతూ ఓ బంగారు తీగ అందరినీ కలుపుతుంది. దేశ సమగ్రతను కాపాడుతోంది"
5. "ఓ వ్యక్తి ఏ జాతికి సంబంధించిన వాడైనా, ఏ మతస్తుడైన, ఏ కులస్తుడైనా సరే ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని కాపాడటంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. వ్యక్తిత్వాన్ని గౌరవిస్తుంది"
6. " యుద్దం గెలిచేందుకు ఏ విధంగా అయితే ధైర్యంగా పోరాడామో అదే విధంగా శాంతిని స్థాపించేందుకు కూడా పోరాడాలి"
7. " మా దారి సుస్పష్టంగా ఉంది. నిర్మాణాత్మకమైన ప్రజాస్వామ్యం, అందరికీ స్వేచ్ఛ, ప్రపంచంలో శాంతి నెలకొల్పడం, ఇతర దేశాలతో మెరుగైన స్నేహం చేయడం"
8. "మేము శాంతియుత వాతావరణంను విశ్వసిస్తాం శాంతియుతమైన అభివృద్ధిని కోరుతాం. ఇది కేవలం భారతీయులకే కాదు ప్రపంచ దేశాలు కూడా ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాం"
9."ప్రభుత్వం యొక్క ముఖ్య ఆలోచన సమాజంను ఒక్కటి చేయడం, ఆ తర్వాత అభివృద్ది సాధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం"
10. "భారత్లో ఏ ఒక్క వ్యక్తి కూడా అంటరానివాడు కాదు. ఏ ఒక్కరిపైనైనా సరే అంటరాని వాడు అని ముద్ర వేస్తే ఆరోజు భారత దేశం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది "
ఇలా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఉత్సాహపరిచే ఎన్నో నినాదాలు పలు సందర్భాల్లో ఇవ్వడం జరిగింది.