తెలంగాణకు బిజెపి నో : రామారావు
హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి భారతీయ జనతాపార్టీ అంగీకరించదని బిజెపి ఉపాధ్యక్షుడు వి. రామారావు స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణా అంశం ఎన్డీఏ అజెండాలో లేనందున బిజెపి అందుకు అంగీకరించేందుకు సాధ్యపడదని ఆయన బుధవారం నాడు హైదరాబాద్లో అన్నారు.
ఎన్డీఏ అజెండాలో ఉండబట్టే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల విభజన సాధ్యపడగలిగిందని ఆయన వివరించారు. తెలంగాణాకు సంబంధించి రాష్ట్ర బిజెపి శాఖ చేయగలిగిందేమీ లేదని రామారావు తేల్చిచెప్పారు. పార్టీ వైఖరిని ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షుడు జానా కృష్ణ మూర్తి స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రత్యేక తెలంగాణా విషయాన్ని మరొక సారి ఆయన దృష్టికి తీసుకు వెళ్లేందుకు రాష్ట్రానికి చెందిన కొందరు నాయకులు చేస్తున్న ప్రయత్నాలు తప్పేమీ కాదని ఆయన అన్నారు.
కాగా, ఇప్పటికీ వరకు బిజెపి తెలంగాణా నాయకులు, కార్యకర్తలలో కొట్టుమిట్టాడుతుండిన చివరి ఆశలు కూడా రామారావు ప్రకటనలతో కొండెక్కాయి. జాతీయ ఉపాధ్యాక్షుడు రామారావు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరువాత తెలంగాణాపై తుది నిర్ణయం తీసుకుంటామని వారం రోజుల క్రితం బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ ప్రకటించిన నేపద్యంలో తెలంగాణాకు చెందిన నాయకులు, కార్యకర్తలు రామారావు నిర్ణయంపై అనేక ఆశలు పెట్టుకుని
వున్నారు.












Click it and Unblock the Notifications