బెంగుళూరు ఐటి మేళాకు విదేశీ సంస్థలు
బెంగుళూరు: గత నాలుగేళ్లుగా బెంగుళూరులో నిర్వహిస్తున్న ఐటి డాట్ కామ్ షోలో ఈ సారి దుబాయి, తైవాన్ వంటి దేశాలనుంచి కూడా కంప్యూటర్ సంస్థలు పాల్గొంటున్నాయి. బెంగుళూరు ఐటి డాట్ కామ్ ఆసియాలోనే అతి ప్రధాన ఐటి షోగా పేరు సంపాదించుకున్న విషయం విదితమే.
ఈ ఏడాది నవంబర్ ఒకటి నుంచి బెంగుళూరు ఐటి డాట్ కామ్ మేళ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది దేశాలకు చెందిన సంస్థలు ఈ మేళాలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఈ ఎగ్జిబిషన్కు సంబంధించి సగం స్పేస్ ఇప్పటికే బుక్ అయినట్టుగా కర్ణాటక ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జర్మనీ, బ్రిటన్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, బెల్జియమ్ ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా కూడా ఇందులో పాల్గొంటున్నదని వారు చెప్పారు. ఎస్టిపిఐ బుక్ చేసిన స్పేస్లో చిన్న , మధ్య తరహా సంస్థలు తమ స్టాల్స్ను ప్రారంభించడానికి అవకాశం వుంటుంది.