అబద్ధమాడాను, క్షమించండి: పూర్ణిమ
హైదరాబాద్: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తెనంటూ గత వారం రోజులుగా జాతీయ స్థాయిలో ప్రచారం పొందిన పూర్ణిమా దేవి ఎట్టకేలకు తాను వెంకయ్య కూతురిని కాననిఅంగీకరించారు. పింగళి వెంకయ్య కూతురు సీతా మహాలక్ష్మిని ఆమె శుక్రవారం కలుసుకుని లిఖితపూర్వక క్షమాపణలు కోరారు. మంచి మనసుతో తనను క్షమించాలని ఆమె అభ్యర్థించారు. పూర్ణిమ రాసిన లేఖనుసీతా మహాలక్ష్మి కుమారుడు గోపీకృష్ణ పత్రికలకు విడుదల చేశారు.
పూర్ణిమా దేవి అను నేను పింగళి వెంకయ్య గారి కూతుర్ని కాదు, పింగళి వెంకయ్యగారి తండ్రి పింగళి హనుమంతరాయడుగారి సహోదరుడగు పింగళి లక్ష్మీనారాయణగారికి ఇద్దరు కుమారులు,పెద్ద కుమారుడు పింగళి లజపతిరావుగారి బహు సంతానంలో నేనొక కుమార్తెను, పింగళి వెంకయ్యగారి కూతుర్ని మాత్రం కాను. ఆయన నాకుపెద్ద నాన్న మాత్రమే. పింగళి వెంకయ్య గారి కూతురినని అబద్ధం చెప్పినందుకుమీరందరూ నన్ను క్షమించాలని ప్రార్థిస్తున్నాను. పింగళి వెంకయ్యగారిపేరు మీద ఒక భవనం కట్టించాలి, ఆయన స్టాంపు వెలువడాలనేదే నా ఆశయం తప్ప వేరే ధనం ఆశించలేదు. మంచి మనసుతో నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను అని పూర్ణిమా దేవిరాశారు. అదే విధంగా సామాజిక కార్యకర్త జగదాంబకు కూడా ఆమె ఒక లేఖరాశారు. పింగళి వెంకయ్య కూతురినని మీకు అబద్ధం చెప్పానని, తనను క్షమించేపెద్ద మనసు మీకు వుందని ఆశిస్తున్నానని ఆమె జగదాంబకు రాసిన లేఖలో అన్నారు.
ఇదిలా వుండగా, తాను పింగళి వెంకయ్య కూతురునంటూ ప్రభుత్వాన్ని, బ్యాంకులను, ప్రజలను మోసం చేసిన పూర్ణిమపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పింగళి వెంకయ్య మనమడు ఘంటసాల గోపీకృష్ణ నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. పూర్ణిమ చేసిన తప్పుడు ప్రచారం వల్ల 79 ఏళ్ల వయసులో ఉన్న తన తల్లిసీతామహాలక్ష్మి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని ఆయన తన ఫిర్యాదులో అన్నారు.