జై బోలో గణేశ్ మహరాజ్ కీ.....
హైదరాబాద్ః జై బోలో గణేష్ మహరాజ్ కీ..... గణపతి బొప్పా మోరియా..ఆధా లడ్డూ ఖాలియా.... అనే నినాదాలు, యువకుల కేరింతలు, కోలాహలంతో రాష్ట్ర రాజధాని నగరం హోరెత్తిపోయింది. వేలాది గణేశులను శనివారం నాడు ఘనంగా ఊరేగిస్తూ తీసుకువచ్చి నగరం నడిబొడ్డున వున్న హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం వరకు అంతంత మాత్రంగా వున్న ఊరేగింపులు ఆ తరువాత ప్రభంజనంలా సాగాయి. నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
గణేష్ నిమజ్జనోత్సవ వేడుకల సందర్భంగాహైదరాబాద్లో శనివారం నాడు అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. జంటనగరాల్లో వెలసిన వేలాదిమంది గణపతుల నిమజ్జన కార్యక్రమం గత మూడు రోజులుగా సాగుతున్నది.
కొన్ని ప్రాంతాల్లో ఏడో రోజు, కొన్ని ప్రాంతాల్లో తొమ్మిదో రోజు నిమజ్జనం జరపగా ప్రధాన నిమజ్జనోత్సవాలు మాత్రం శనివారం 11వ రోజు జరుగుతున్నాయి. నిమజ్జనోత్సవం ఉరేగింపుకు నాయకత్వం వహించే పాతబస్తీలోని బాలాపూర్లోని ప్రధాన గణపతివిగ్రహాన్ని ఉదయాన్నే వేదోక్తంగా పూజలు నిర్వహించి కదలించారు. బాలాపూర్ గణపతి కదలిన తర్వాత వివిధ ప్రాంతాల్లోని ఇతర గణేషవిగ్రహాలు కూడా కదిలాయి.
ఈ సందర్భంగా గత పదకొండు రోజులుగా బాలాపూర్ గణేషుని చేతిలో వున్న లడ్డూను వేలం వేయగా 85 వేల రూపాయల ధర పలికింది. ఏటా బాలాపూర్ గణేషుని చేతిలోని లడ్డూను వేలం వేయడం ఆనవాయితీగా వస్తున్నవిషయం విదితమే. బాలాపూర్ గణపతిని 15 కిలోమీటర్ల భారీ ఊరేగింపు తర్వాతవినాయకసాగర్లో నిమజ్జనం చేస్తారు. పాతబస్తీలోని ఇతర ప్రాంతాల్లో, కొత్త నగరంలోని వివిధ కేంద్రాలనుంచివినాయకమూర్తులు నిమజ్జనానికి తరలివెళ్లుతున్నాయి.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 10 వేల మంది పోలీసులతో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా పోలీసులను మొహరించారు. గణేష్ నిమజ్జనోత్సవ ఊరేగింపు జరిగే ప్రధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. నగరంలోనిఅందరు గణపతుల్లోకి భారీ గణపతి ఖైరతాబాద్లో వున్నారు. 40 అడుగుల పొడవు, 22 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన ఈ భారీ గణపతిని తెల్లవారుజాము సమయంలో నిమజ్జనం చేశారు.
వివిధ రాజకీయ పక్షాలు, సంఘసేవాసంస్థలు నిమజ్జనానికి కదలినవినాయకులకు స్వాగతం చెప్పేందుకు ప్రధానకూడళ్లలో స్వాగతం పలికారు.