నవంబర్లో ప్రధాని రష్యా పర్యటన
మాస్కోః భారత ప్రధాని వాజ్పేయి నవంబర్లో రష్యా పర్యటించే అవకాశం వున్నది. ఈ పర్యటన సందర్భంగా భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందం పరిధిని నిర్వచించే వివిధ పత్రాలపై ఆయన సంతకాలు చేసే అవకాశం వుంది.
సైన్స్, టెక్నాలజీ రంగాల్లో సహకారానికి సంబంధించిన కీలక పత్రాలపై ఆయన సంతకాలు చేస్తారు. వాజ్పేయి పర్యటన భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసే అవకాశం వుంది. గత ఏడాది రష్యా నేత పుతిన్ భారత పర్యటన దరిమిలా ఉభయ దేశాల మధ్య సన్నిహితస్నేహ సంబంధాలకు మార్గం మరింత సుగమంఅయింది. వాజ్పేయి పర్యటనకు పుతిన్ సర్కారు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది.
వాజ్పేయి మాస్కో పర్యటన సందర్భంగా ఉభయ దేశాల నేతలు శిఖరాగ్ర సభలో పాల్గొనే అవకాశం వుంది. ఈ శిఖరాగ్ర సభకోసం ఉభయ దేశాలు ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఎజెండా ఖరారు కోసం విదేశాంగ మంత్రి జస్వంత్సింగ్ రష్యా విదేశాంగ మంత్రి ఇవానోవ్తో న్యూయార్క్లోసెప్టెంబర్ 26న చర్చలు జరిపే అవకాశం వుంది. కమ్యూనికేషన్ల మంత్రి రామ్విలాస్పాశ్వాన్ పదిమంది సభ్యుల బృందంతో కలసి వచ్చే నెల మొదటివారంలో రష్యా పర్యటించే అవకాశం వుంది. ఆ తర్వాత ఐటి మంత్రి ప్రమోద్ మహాజన్ కూడా మరో బృందంతో కలసి రష్యా వెళ్తారు. చివరగా జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు బ్రిజేష్మిశ్రా కూడా సెప్టెంబర్ ఆఖరులో రష్యా పర్యటించి ద్వైపాక్షిక సంబంధాలకు ఉద్దేశించిన ఫ్రేమ్వర్క్ను ఖరారు చేస్తారు.