ముషారఫ్ పై పాక్ లో నిరసన వెల్లువ
కరాచీః అమెరికాకు అండగా నిలవాలనే పాక్ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నిర్ణయంపై పాకిస్తాన్ లో నిరసన వెల్లువెత్తుతున్నది. వేలాది మంది ముస్లిం మత సంస్థల కార్యకర్తలు గురువారం నాడు కరాచీలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా ఇస్లాంపైనే యుద్ధానికి సన్నద్ధం అవుతున్నదని, బుష్ కుయుక్తులు తెలియని ముషారఫ్ ఆయనకు దాసోహం అంటే సహించేది లేదని మత ఛాందసవాదులు దుమ్మెత్తి పోశారు.
ముస్లింలకు యూదులకు మధ్య ఈ పోరాటం రాజుకుంటున్నవిషయాన్ని అన్ని ముస్లిం దేశాలు గ్రహంచాలని వారుకోరారు. ఆప్ఘన్ ముల్లాలు జీహాద్ ప్రకటిస్తే పవిత్ర యుద్ధానికి ప్రతి ఒక్క ముస్లిం కూడా సిద్ధంగా వుండాలని వారు పిలుపునిచ్చారు. కరాచీ తో పాటు పలు పట్టణాల్లో కూడా ఇటువంటి నిరసన ప్రదర్శనలు జరగడంతో ముషారఫ్ ఇరుకున పడుతున్నారు. ఓ వైపు అమెరికా ఒత్తిడి, మరోపైపు ముస్లిం ఛాందస వాద సంస్థల వ్యతిరేకత, మూడో వేపు వెల్లువలా వలస వస్తున్న ఆఫ్ఘన్లతో ముషారఫ్ చక్రబంధంలో చిక్కుకున్నారు.