ప్రైవేట్ బస్సులు పెంచండి: బాబు
హైదరాబాద్: ఆర్టీసి ఉద్యోగులు సమ్మెను ఎదుర్కోవడానికి ప్రయివేట్ బస్సులనుపెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆర్టీసి అధికారులను ఆదేశించారు. ఆర్టీసి సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితులను ఆయన మంగళవారంనాడు సమీక్షించారు. రాష్ట్రంలో 2,100 ప్రయివేట్ బస్సులు వుండగా 900 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఆర్టీసి కార్మికులకు భయపడి బస్సులు నడపడానికి ప్రయివేట్ బస్సుల యజమానులు భయపడుతున్నారని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. పోలీసులను మోహరించి ప్రయివేట్ బస్సులను ఎక్కువగా నడిపించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఆర్టీసి కార్మికుల సమ్మె మంగళవారంనాటికి రెండో రోజుకు చేరుకుంది. తమ నాయకులను 450 మందిని ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించిందని ఆర్టీసి కార్మికులుఅంటున్నారు. బస్సులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కొద్ది మందినే తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పుతున్నారు. కార్మికుల సమ్మెతో రాష్ట్రంలోని ఆర్టీసిబస్ స్టేషన్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పోలీసుల సహాయంతోహైదరాబాద్లో కొన్ని సిటీ బస్సులను నడిపిస్తున్నారు.
సమ్మె ద్వారా ఆర్టీసి కార్మికులు సాధించేది శూన్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్ ఆర్టిసి) మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.పి. సింగ్ అన్నారు. సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. జిల్లాల్లో 545 బస్సులు నడుపుతున్నట్లు, హైదరాబాద్ నగరంలో 303 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసి అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications