కాశ్మీర్ తీవ్రవాదంపై ఉక్కుపాదం: అద్వానీ
న్యూఢిల్లీ: కాశ్మీర్లో మరోసారి కాల్పుల విరమణ అనేది వుండదని, కాశ్మీర్లోని తీవ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణచివేయడమే తమ లక్ష్యమని హోం మంత్రి ఎల్.కె. అద్వానీ అన్నారు. కాశ్మీర్లో భారత్ ఇంతకు ముందు అమలు చేసిన కాల్పుల విరమణను ప్రస్తావిస్తూ ముస్లిం మిలిటెంట్లు ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్వుతున్నారే తప్ప సానుకూలంగా ప్రతిస్పందించడం లేదని ఆయన అన్నారు.
కాశ్మీర్ ప్రజలకు కొంత ఊరట ఇవ్వడానికి తాము ఇంతకు ముందు కాల్పుల విరమణను అమలు చేశామని, అయితే దీనికి మిలిటెంట్లు సానుకూలంగా ప్రతిస్పిందించలేదని ఆయన అన్నారు. మనపై ఎక్కు పెట్టిన తీవ్రవాదంపై పోరు సల్పి దాన్ని ఓడించడమే మన ప్రథమ లక్ష్యమని, ఇందుకు కట్టుబడి వున్నామని ఆయన అన్నారు.
అమెరికాలో సెప్టెంబర్ 11వ తేదీన అఎn్ఘానిస్థాన్లోని ఒసామా బిన్ లాడెన్ నెట్వర్క్ ఆల్- ఖైదా దాడి చేయడం ప్రపంచ చరిత్రలో ఒక మలుపు అని ఆయన అన్నారు. సీమాంతర ఉగ్రవాదం భారత్పై చాలా యేళ్లుగా దాడి చేస్తూ వస్తోందని, సెప్టెంబర్ 11వ తేదీ దాడులు సీమాంతర ఉగ్రవాదం కన్నా దారుణమైనవని, ఇవి ఖండాంతర ఉగ్రవాద చర్యలని ఆయన అన్నారు.
ద్వేషాన్ని, అసహనాన్ని, హింసను రెచ్చగొట్టడానికి ఆల్ ఖయిదా నెట్వర్క్ చేపట్టిన ప్రచారానికి ఆధునిక ప్రపంచ చరిత్ర సమానమైనది మరోటి లేదని ఆయన అన్నారు. ఈ కొత్త రకం అంతర్జాతీయ ఉగ్రవాదం మానవ నాగరికతకే ప్రమాదకరమని ఆయన అన్నారు.