అమ్మవారికి అవమానం
హిందువుల దేవతా మూర్తులను అవమానించే ధోరణులు పశ్చిమదేశాల్లోనే వున్నాయనుకుంటే అవి స్వదేశానికి కూడా పాకాయి. స్వదేశంలో అందులోనూ మతపరంగా అత్యంత సున్నితమైన హైదరాబాద్ నగరంలో అలాంటి సంఘటను కనీసం ఊహించగలమా? ఆంధ్రుల రాజధాని హైదరాబాద్లోని విలాసవంతమైన బంజారాహిల్స్ రోడ్లో ఒక అత్యాధునిక రెస్టారెంట్ చట్నీస్ వెలిసింది. పేరులోని కొత్తదనంతోనే ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే పాపులర్ రెస్టారెంట్గా మారింది.
ఈ రెస్టారెంట్లో ఉపయోగిస్తున్న టేబుల్ మ్యాట్స్పై హిందూ దేవతల బొమ్మలు వుండటం వివాదాస్పదంగా మారింది. సీనియర్ కాంగ్రెస్ నేత పి జనార్ధన్రెడ్డి ఈ వివాదాన్ని లేవనెత్తారు. తన స్నేహితులతో కలసి ఈ రెస్టారెంట్కు వెళ్లిన పిజెఅర్ రెస్టారెంట్లో ఉపయోగిస్తున్న డిస్పోజబుల్ టేబుల్ మ్యాట్స్పై దుర్గామాత చిత్రాలను గమనించి రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీశారు. అమ్మవారికి పిజెఅర్ ఎంత భక్తుడో నగరవాసులందరికీ తెలసు. జుబ్లీహిల్స్లోని పెద్దమ్మను ఇలవేల్పుగా ఆరాధించే పిజెఆర్ ఆ ఆలయం అభివృద్ధిలో కూడా కీలక పాత్ర వహించారు.
ఈ విషయాన్ని పంజాగుట్ట పోలీసు స్టేషన్లో రిపోర్టు చేయడంతో పాటు నేరుగా పోలీసు కమిషనర్ దృష్టికి కూడా తీసుకువెళ్లాడు. హిందు దేవతలను అవమానించే విధంగా వ్యవహరిస్తున్న రెస్టారెంట్లు, హోటళ్లను తక్షణమే మసివేయించాలని డిమాండ్ చేశారు. దేశమంతా దేవీ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుపుకుంటూ అమ్మవారిని అరాధిస్తుంటే కొన్ని రెస్టారెంట్లు ఇలా అవమానకరంగా ప్రవర్తించడం సహించరాని విషయమని పిజెఆర్ అన్నారు. చట్నీస్ వ్యవహారం పిజెఆర్ దృష్టిలో పడింది కనుక పోలీసు కంప్లయింట్తో పోయిందని అదే ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ వంటి సంస్థల కంట్లో పడితే హోటలే చట్నీ అయ్యేదని కొందరు పోలీసులే వ్యాఖ్యానించారు.