ఆదిలాబాద్ బాలునికి సాహస అవార్డు
ఆదిలాబాద్ః జాతీయ సాహసబాలురకు ఇచ్చే అవార్డుకు తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక బాలుడు ఎన్నికయ్యాడు. ప్రఖ్యాత సందర్శనీయ స్థలం కుంటాల జలపాతంలో వరద ప్రవాహంలో చిక్కుకున్న ఆరుగురిని తన ప్రాణల్ని సైతం లెక్కచేయకుండా సోమేశ్వర్ కాపాడాడు.
ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న సోమేశ్వర్ జలపాతం వద్ద చేపలు పట్టేవాడు. జులై 29న బెల్లంపల్లికి చెందిన ఆరుగురు యువకులు జలపాతంలో స్నానం చేస్తూ ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రవాహం మధ్యలో వున్న బండరాళ్ల మధ్య చిక్కుకున్నారు.
వారి కేకలు విన్న సోమేశ్వర్ ఈదుతూ వెళ్లి వారిని ఒక్కక్కరినీ మరో సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. ఆ తర్వాత పావుగంటలోనే ప్రవాహం మరింత తీవ్రం కావడంతో అప్పటివరకు వారున్న ప్రదేశం కూడా మునిగిపోయింది. ఈ లోపు సోమేశ్వర్ కేకలు వున్న సమీపంలోని కుంటాల గ్రామస్తులు వచ్చి తాళ్ల సహాయంతో వారిని కాపాడారు.