హైదారాబాద్ః వ్యవసాయ శాఖ సీనియర్ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నాడిక్కడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించిన అనేక అంశాలకు వ్యవసాయ శాఖ అధికారులు జవాబు ఇవ్వకపోవడంతో సిఎం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులకు ముఖ్యమంత్రికి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. రాష్ట్ర స్థూల రాబడిలో వ్యవసాయ రంగం వాటా పెంచాల్సిన అవసరం వున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకోసం వ్యవసాయం ఖర్చులపై, రాబడిపై నిర్ధిష్టమైన అంచనాలనుతయారు చేయాలని ఆయన కోరారు.
విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలపై రెతులకయ్యే వ్యయం, విద్యుత్కు పెట్టే ఖర్చు ఇతర పెట్టుబడులను లెక్కించి ప్రతిఎకరాకు వచ్చే రాబడి ఒక్కో రకం పంటకు ఎంతవుంటుందో తేల్చి వ్యవసాయం ఏ విధంగా గిట్టుబాటు అవుతుందో రైతులను జాగృతం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ దశలో ముఖ్యమంత్రి అడిగిన కొన్ని ప్రశ్నలకు వ్యవసాయ శాఖ సీనియర్ అధికారుల నుంచి కూడా సమాధానం లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువు, అధికారం, యంత్రాంగం అన్నీ వుండి వ్యవసాయ శాఖ అధికారులే అవగాహన చేసుకోలేకపోతే సామాన్య రైతులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications
