మంటల్లో రైలుః 300 మంది మృతి
కైరోః ఈజిప్ట్లో బుధవారం నాడు రైల్లో చెలరేగిన మంటలకు 300 మంది ప్రయాణికులు సజీవంగా దహనమయ్యారు. కైరో నుంచి వెళ్తున్న రైలులోనిప్యాంట్రీకారులో సిలెండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు తీవ్రతకు తోడుగా రైలు వేగంగా వెళ్తుండటంతో మంటలు శరవేగంతో మొత్తం రైలును ఆక్రమించాయి. రైళ్లో ప్రయాణికులు గాఢ నిద్రలో వున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించి రైలును ఆపే లోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. రైళ్లో 300మంది పైగా ప్రయాణికులు వున్నట్టుగా చెబుతున్నారు. మృతదేహాలు గుర్తించడానికి కూడా వీలులేనంతగా కాలిపోయాయి. రైలు వెనక భాగంలో వున్న ప్యాంట్రీ కారులో చెలరేగిన మంటలు మొత్తం రైలును ఆక్రమించాయి. తమనుతాము కాపాడుకోవడానికి కొందరు ప్రయాణికులు రైళ్లోంచి దూకి దుర్మరణం పాలయ్యారు. చాలా బోగిల్లో కిటికిలూ, తలుపు తెరుచుకోలేదని తెలిసింది. ప్రయాణికులంతా పండగ సెలవుల వల్ల కైరో నుంచి స్వస్థలాలకు వెళ్లుతున్నారు.