చెన్నైః అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత అండిపట్టీ నియోజకవర్గం అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. ఈ విజయంతోనే ఆమె ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు కూడా ఏర్పాట్లు చురుగ్గా ప్రారంభమయ్యాయి.
ఆదివారం నాడు జయలలిత 54వ జన్మదినోత్సవం కావడం అండిపట్టిలో ఆమె ఘనవిజయం సాధించడంతో పోయస్ గార్డెన్లో అన్నాడిఎంకె కార్యకర్తల విజయోత్సవాలకు పట్టపగ్గాలు లేకుండా వుంది. ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ఎంతతొందరగా అమ్మకు రాష్ట్ర సారథ్యం అప్పగిద్దామా అని ఆరాటంగా వున్నారు. ఆదివారం మధ్యాహ్నం జరుగుతున్న అన్నాడిఎంకె లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో జయలలితను నేతగాఎన్నుకున్నారు. అంతిమంగా ధర్మానికి విజయం తప్పదని తన ఎన్నిక రుజువు చేసిందని జయ వ్యాఖ్యానించారు. అనేక కష్టాలను ఇబ్బందులు ఎదుర్కుని ఈ విజయం సాధించినట్టు ఆమె తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకుంటానని ప్రకటించారు. ఈ ఎన్నిక ముగిసిన వెంటనే పన్నీర్సెల్వం వెళ్లి రాజ్భవన్లో గవర్నర్ను కలసి తమ రాజీనామా సమర్పించే అవకాశం వుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ జయలలిత గవర్నర్ను కలుస్తారు. మంగళవారం లేదా బుధవారం నాడు జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం వున్నదని అంటున్నారు.