శ్రీనగర్: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21విమానం ఒకటి గురువారం మధ్యాహ్నం కూలిపోయింది. శ్రీనగర్విమానాశ్రయం సమీపంలో నివాసాలపై ఈ విమానం కూలిపోయింది.
ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. పైలట్ క్షేమంగా ఉన్నాడు. అయితే అతను ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల 25 నిమిషాల ప్రాంతంలో బద్గాం జిల్లాలోని లాల్గోమ్ గ్రామంలోని గులాం అహ్మద్ గనాయ్ ఇంటిపై ఈ విమానం కూలిపోయింది. ఇటీవలి కాలంలో మిగ్ విమానాలు వరుసగా కూలిపోతున్నాయి. ఇప్పటి వరకు 12 మిగ్ విమానాలు కూలిపోయాయి. భారత్ మిగ్-21 విమానాన్ని తామే కూల్చి వేశామని పాకిస్థాన్ అనుకూల తీవ్రవాద సంస్థ జమైత్- ఉల్- ముజాహిదీన్ ప్రకటించుకుంది. అయితే అటువంటి పరిస్థితి లేదని బారత వైమానిక దళం ప్రకటించింది. క్షిపణిని ప్రయోగించి మిగ్ను కూల్చి వేశామని పిటిఐ వార్తా సంస్థకు ఆ సంస్థ అధికార ప్రతినిధి ఫోన్ చేసి చెప్పాడు. ఆయుధాలు వదలివేయాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ఇచ్చిన పిలపునకు నిరసనగా ఈ విమానాన్ని కూల్చి వేసినట్లు అతను చెప్పాడు.