పోలీసులను వదిలేయండి: బాబు
హైదరాబాద్/ఒంగోలు: కుటుంబ సభ్యుల, ప్రజల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని పోలీసులను వదిలిపెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పీపుల్స్వార్ నక్సలైట్లకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కిడ్నాపైన నలుగురు పోలీసుల్లో ముగ్గురు ఇంకా పీపుల్స్వార్ బందీలుగా ఉన్న విషయం తెలిసిందే.
తాజా పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం సమీక్షించారు. నక్సలైట్ల చెరలో ఉన్న పోలీసుల విడుదలకు మీడియా, మేధావులు సహకరించాలని ఆయన కోరారు. గిరిజనులను, ఆమాయకులను వేధించబోమని ఆయన హామీ ఇచ్చారు. గాలింపు చర్యలు నిలిపేశామని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మూడు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
పీపుల్స్వార్ నక్సలైట్లు ఇచ్చిన 48 గంటల గడువు గురువారం సాయంత్రంతో ముగుస్తోంది. దీక్షలో ఉన్న పీపుల్స్వార్ బందీలుగా వున్న పోలీసుల భార్యల ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో నక్సలైట్ల నుంచి పోలీసులను విడిపించేందుకు 300 మంది నల్లమల అడవులకు బయలుదేరి వెళ్లారు.