వై.ఎస్ వద్ద మంత్రదండం ఉందా?:బాబు
హైదరాబాద్: అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో అన్ని పెండింగ్ ప్రాజెక్ట్ లను పరిష్కరించి, పూర్తి స్థాయిలో అభివృద్ది పరుస్తామన్న వై.ఎస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ గిమ్మిక్కుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ప్రతిపక్ష నేత వై.ఎస్ పాదయాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఆయన గురువారం స్పందిస్తూ..కాంగ్రెస్ వద్ద కొత్త ఆలోచనలు కొరవడి, ప్రజలను మభ్యపెట్టే ఆకర్షక ఆలోచనలను ఆశ్రయిస్తున్నారని అన్నారు.
జలచైతన్యం కార్యక్రమంలో భాగంగా ఆయన వరంగల్ జిల్లా కే.సముద్రం మండలం ఇనుమర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు.
నేను రోజుకు 24 గంటలు పనిచేస్తున్నాను. ఏడున్నరేళ్ళుగా అధికారులతోనూ అదే విధంగా పనిచేయిస్తున్నాను. అభివృద్ధే ధ్యేయంగా శ్రమిస్తున్నాను. కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలకు విలువలేదు. ప్రజలకు అన్నీ తెలుసు అని ఆయన అన్నారు. వై.ఎస్. పాదయాత్రే ఒక రాజకీయ గిమ్మిక్కు అని ఆయన అభిప్రాయపడ్డారు.
కరువుతో అల్లాడుతోన్న ప్రజలకు తమ వంతు సాయం చేయాలి. కానీ ఆయన రాజకీయ ప్రసంగాలు చేస్తున్నాడు. దీన్నే బట్టే ఆయన యాత్రల ఉద్దేశం ఏమిటో అర్థమవుతుందని ముఖ్యమంత్రి విమర్శించారు.