కొలిక్కిరాని కాంగ్రెస్ చర్చలు
Posted on 20-11-03
న్యూఢిల్లీ: తెలంగాణపై వైఖరిని, శాసనసభ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానవర్గంతో రాష్ట్ర నేతలు జరిపిన చర్చలు గురువారం ఒక కొలిక్కి రాలేదు. ఒకటి, రెండు రోజుల్లో చర్చలు పూర్తి కాగలవని భావిస్తున్నారు.
చర్చలు కాంగ్రెస్ హైకమాండ్ తరఫున గులాం నబీ ఆజాద్, ప్రణబ్ ముఖర్జీ, వాయలార్ రవి, రాష్ట్ర నాయకులు డి. శ్రీనివాస్, డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ నాయకులు జి. చిన్నారెడ్డి, డాక్టర్ కె. కేశవరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణపై పార్టీలో భేదాభిప్రాయలు ఉన్నందున, ప్రజల సెంటిమెంట్లకు సంబంధించిన అంశమైనందున పార్టీ విస్తృత చర్చలు జరుపుతోంది. ఈ విషయంపై నిర్ణయాన్ని రాష్ట్ర నాయకులు అధిష్ఠానవర్గానికే వదిలేశారు.
గురువారంనాటి చర్చల అనంతరం విలేకరులు తెలంగాణ విషయాన్ని ప్రస్తావించగా తెలంగాణ తప్ప మీకు ఏదీ కనబడదా అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్రానికి చెందిన అన్ని అంశాలపై చర్చించామని ఆయన చెప్పారు.