ఏపీలో కుండపోత వర్షాలు: అల్లూరి జిల్లాలో వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన.. 15గ్రామాలకు రాకపోకలు బంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండురోజులుగా ఏపీలో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అల్లూరి జిల్లాలో విస్తారంగా వర్షం కురవడంతో జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని 15 గ్రామాలకు ఈ వంతెన ద్వారానే రాకపోకలు సాగుతుండేవి.
2024లో కూడా ఇదే వంతెన ధ్వంసమైన క్రమంలో మళ్ళీ తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది కూడా కొట్టుకుపోవడంతో గ్రామాలకు రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో 15 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల ప్రజలు గతంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. స్థానిక గిరిజనులు శాశ్వత బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

మరోవైపు విజయవాడలో శనివారం ఉదయం నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, బాటసారులు అవస్థలు పడ్డారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన ప్రకారం, వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోంది.రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తార వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో గంటకు 50-60 కిమీ, దక్షిణ కోస్తాలో 40-50 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అల్పపీడన ప్రభావం కారణంగా, శ్రీకాకుళం నుండి పల్నాడు వరకు రాబోయే 3 గంటలలో వర్ష సూచన ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే, రాబోయే 2 గంటల్లో కోనసీమ, పశ్చిమ గోదావరి మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.














Click it and Unblock the Notifications
