గోపన్నను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
రాజమండ్రి/హైదరాబాద్: సిపిఐ (మావోయిస్టు) ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు శేషగిరి రావు అలియాస్ గోపన్నను పోలీసులు సోమవారం రాజమండ్రి కోర్టులో హాజరు పరిచారు. అసాధారణ భద్రత మధ్య అతడ్ని కోర్టులో హాజరు పరిచారు. అతనితో పాటు సుజాత అనే ఒక యువతిని కూడా కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ హైదరాబాద్లో చెప్పారు. శేషగిరిరావును ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్కు పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రిజర్వ్ పోలీసు కార్యాలయం పేల్చివేతకు రెక్కి నిర్వహిస్తుండగా శేషగిరిరావును అరెస్టు చేసినట్లు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. బస్సు హైజాక్, ఐదుగురు మృతికి కారణమైన మందుపాతర పేల్చివేత కేసుల్లో శేషగిరిరావును నిందితునిగా పోలీసులు పేర్కొన్నారు. తాను పోలీసులకు లొంగిపోలేదని, తనను పోలీసులు అరెస్టు చేశారని శేషగిరిరావు అన్నారు. తమకు కోర్టులపై, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని ఆయన అన్నారు. తన న్యాయపోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు.
శేషగిరి రావు రాజమండ్రిలోని ఒక లాడ్జిలో ఒక గిరిజన యువతితో ఉండగా పోలీసులు అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. మావోయిస్టు ప్రతినిధి వరవరరావు మాటల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. శేషగిరిరావుతో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారని వరవరరావు చేసిన ప్రకటనలో నిజం లేదని, చాలా సార్లు వరవరరావు అబద్ధాలే మాట్లాడుతారని ఆయన అన్నారు. శేషగిరిరావు వరంగల్కు చెందినవాడని ఆయన చెప్పారు.
శేషగిరిరావును ఈ నెల 2వ తేదీన పోలీసులు అరెస్టు చేశారని, అతన్ని కోర్టులో హాజరు పరచాలని వరవరరావు ఆదివారం నాడు అన్నారు. రాజమండ్రిలోని లాడ్జ్ నుంచి శేషగిరి రావును తరలించారని, అతడ్ని ఎన్కౌంటర్ పేర చంపే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో శేషగిరిరావును హైదరాబాద్కు తరలించినట్లు ఆదివారంనాడు వార్తలు వెలువడ్డాయి. అయితే అనూహ్యంగా పోలీసులు సోమవారంనాడు రాజమండ్రి కోర్టులో శేషగిరిరావును హాజరు పరిచారు.