కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలి: సానియా
ముంబాయి: ప్రతిభ గల క్రీడాకారులకు సహాయం అందించడానికి కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని టెన్నిస్ సెన్సేషన్ సానియా మీర్జా విజ్ఞప్తి చేశారు. అథ్లెట్స్ వెలుగులోకి రావడానికి కార్పోరేట్ సంస్థలు స్పాన్సర్ చేయాలని ఆమె అన్నారు. క్రీడాకారులకు సరైన మద్దతు, శిక్షణ అవసరమని, కార్పోరేట్ సంస్థలు ముందుకు వచ్చినప్పుడే మరింత మంది టెన్నిస్ క్రీడాకారులు, క్రికెట్ క్రీడాకారులు, రాథోర్స్ వెలుగులోకి వస్తారని ఆమె అన్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా ముంబాయిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
తాను చాలా అదృష్టవంతురాలినని ఆమె తనకు కార్పోరేట్ సంస్థల నుంచి అందిన సహాయం గురించి అన్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా గ్రాండ్స్లామ్లో మూడో రౌండ్కు చేరుకున్న తొలి మహిళగా హైదరాబాదీ సానియా రికార్డు సృష్టించారు. గత రెండు నెలల కాలంలో ఆమె ఎన్నో అద్బుతాలు చేసింది. దుబాయ్ ఓపెన్లో ఆమె క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది.
తాను చాలా అదృష్టవంతురాలినని, తాను ఏమీ కాని సమయంలో 13 ఏళ్ల వయసులో తనకు స్పాన్సర్షిప్ దొరికిందని, ఇప్పుడు చాలా కార్పోరేట్ సంస్థలు స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తున్నాయని, తద్వారా లాభం పొందాలనే ఉద్దేశ్యంతో అవి ముందుకు వస్తున్నాయని ఆమె అన్నారు. కేవలం క్రికెట్ను మాత్రమే కాకుండా ఇతర క్రీడాకారుల వైపు కూడా చూస్తున్నారని ఆమె స్పాన్సర్షిప్ విషయంలో అన్నారు.