యూనిస్ డబుల్ సెంచరీ: పాక్ స్కోర్ 570
బెంగుళూర్: పాకిస్థాన్ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ డబుల్ సెంచరీ మిస్సై నిరాశ పరిచినా యూనిస్ ఖాన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో ప్రేక్షకులను అలరించాడు. యూనిస్ఖాన్ 267 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. భారత్పై డబుల్ సెంచరీ చేసిన ఐదవ పాక్ బ్యాట్స్మన్గా యూనిస్ఖాన్ రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్ ఆటగాళ్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాట్స్మన్గా కూడా యూనిస్ఖాన్ రికార్డు రచించాడు. యూనిస్ఖాన్ హర్బజన్ బౌలింగ్లో అవుట్ కావడంతో అతని మారథాన్ ఇన్నింగ్స్కు తెర పడింది.
గురువారం ఆట ముగిసే సమయానికి 184 పరుగుల వ్యక్తిగత స్కోర్తో నాటవుట్గా మిగిలి శుక్రవారం బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ కెప్టెన్ బాలాజీ వేసిన తొలి బంతికే అవుటయ్యాడు. పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్లో 570 పరుగుల భారీ స్కోర్ సాధించి పటిష్టమైన స్థితికి చేరుకుంది. 323 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో పాకిస్థాన్ శుక్రవారం బ్యాటింగ్కు దిగింది. అప్పటికి పాకిస్థాన్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. శుక్రవారం మిగతా వికెట్లన్నీ కోల్పోయి ఆలవుట్ అయింది. హర్బజన్కు ఆరు వికెట్లు లభించాయి. తనపై వచ్చిన విమర్శల నేపథ్యంలో హర్బజన్ దూస్రా ప్రయోగించకపోవడం విశేషం. సమీ రన్నవుట్ అయ్యాడు. ఇంజామామ్, యూనిస్ఖాన్లు మినహా మిగతా పాకిస్థాన్ బ్యాట్స్మెన్ పెద్ద స్కోర్ చేయలేకపోయారు.
భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ తన సహజమైన శైలిలో చెలరేగి ఆడాడు. సెహ్వాగ్ 39 పరుగులతో నాటవుట్గా ఉన్నాడు. ఇందులో ఒక సిక్సర్ కూడా ఉంది. గౌతమ్ గంభీర్ 13 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు.