ప్రభుత్వానికి ఓపిక లేదు: రామకృష్ణుడు
హైదరాబాద్: శాసనసభలో ప్రజాసమస్యలను చర్చించే ఓపిక ప్రభుత్వానికి లేదని తెలుగుదేశం విమర్శించింది. ప్రజాసమస్యలు చర్చకు రాకుండా అధికార కాంగ్రెస్ పక్షం సమయాన్ని వృధా చేస్తోందని తెలుగుదేశం శానసభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. తమ అవినీతి, అక్రమాలు బయటపడుదామనే ఉద్దేశంతో కాంగ్రెస్ సమస్యలేవీ చర్చ రాకుండా చూస్తోందని ఆయన అన్నారు. గతంతో పోలిస్తే శాసనసభా సమయం 25 గంటలు తగ్గిందని ఆయన చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు సభను వాయిదా వేయాలని, ఐదు నిమిషాలు సజావుగా సాగకపోతే వాయిదా వేయాలని, వాయిదా వేస్తే ఇంటికి వెళ్లి పనులైనా చేసుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అంటున్నారని, ముఖ్యమంత్రి మాటలే ప్రభుత్వ ఉద్దేశ్యమేమిటో తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. స్పీకర్ను ముఖ్యమంత్రి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆదేశిస్తున్నారని ఆయన తప్పు పట్టారు.