మభ్యపెట్టే ప్రకటనలు వద్దు: టిఆర్యస్తో బిజెపి
హైదరాబాద్: తెలంగాణపై ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) భాగస్వామ్య పార్టీలను ఒప్పించలేని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) నాయకులు ఇప్పుడు తమ నాయకుల చుట్టూ తిరగడం ప్రజలను మభ్యపెట్టడానికేనని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ కె. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. పదవులను కాపాడుకోవడానికి తమ నాయకుల చుట్టూ టి ఆర్యస్ నాయకులు తిరుగుతున్నారని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు.
టి ఆర్యస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలను మానుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదని తేలిపోయిందని, గుట్టు రట్టయిందని, ఈ స్థితిలో టి ఆర్యస్ నాయకులు మంత్రి వర్గం నుంచి తప్పుకోవడం మంచిదని ఆయన అన్నారు. తమ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు వల్ల బిజెపి తెలంగాణ గురించి మాట్లాడటం లేదనే టి ఆర్యస్ నాయకుల ప్రకటనలను ఆయన ఖండించారు.












Click it and Unblock the Notifications