జూనియర్ల సమ్మె కొనసాగింపు: రేపు చర్చలు
హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. జూనియర్ డాక్టర్ల సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. హైదరాబాద్లో జూనియర్ డాక్టర్లు నల్ల బూరలతో ప్రదర్శన నిర్వహించారు. వరంగల్లో మౌన ప్రదర్శన చెప్పారు. జూనియర్ డాక్టర్లతో సోమవారం మరోసారి చర్చలు జరపనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఐ.వి. సుబ్బారావు చెప్పారు. ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి జూనియర్ డాక్లర్ల సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై సమీక్ష చేశారు.
ఆ సమీక్షానంతరం ఐ.వి. సుబ్బారావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లసు పరిష్కరించగలమని ఆయన చెప్పారు. జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ సూచనల్లో రెండింటిని అమలు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని, వైద్య బోధనా సిబ్బంది వివరాలను వెబ్సైట్ పెట్టామని, మిగతా సమస్యలను కూడా పరిష్కరించే దిశలో సాగుతున్నామని ఆయన వివరించారు. తాము ప్రతిస్పందించిన తీరును అర్థం చేసుకోవాలని, అందువల్ల సమ్మె చేయాల్సిన అవసరం లేదని తాము జూనియర్ డాక్టర్లకు చెప్పినట్లు ఆయన తెలిపారు.
ఇదిలావుంటే, జూనియర్ డాక్టర్లు ప్రత్యామ్నాయ వైద్య సేవలను అందిస్తున్నారు. రోగులకు ఔట్ పేషెంట్లను పరీక్షించి మందులు అందిస్తున్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఆదివారం జూనియర్ డాక్టర్లు ప్రత్యామ్నాయ వైద్య సేవలందించారు.