ప్రధాని మోదీకి నేను పెద్ద ఫ్యాన్: ట్రంప్ సంచలనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ఈ కార్యక్రమంలో యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి తాను గొప్ప అభిమాని అని.. మోదీ తనకు మంచి స్నేహితుడు ట్రంప్ అని పేర్కొన్నారు. "మీరు మా దేశ ప్రతినిధిగా ఉండాలి సెర్గియో.. అందరికీ హాయ్ చెప్పాలనుకుంటున్నాను. నేను ప్రధానమంత్రిని ప్రేమిస్తున్నాను. మోదీ గొప్పవాడు. అతను నా స్నేహితుడు" అని అమెరికా స్వాతంత్ర్య ప్రకటన 250 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ పై ట్రంప్ లైవ్ లో కనిపించి మాట్లాడారు.
భారత్-అమెరికా భాగస్వామ్యం గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ, తాను ప్రధాని మోడీకి "గొప్ప అభిమానిని" అని పునరుద్ఘాటించారు. భారతదేశానికి అవసరమైన ఏ సహాయం కోసమైనా అమెరికా అధ్యక్షుడుపై ఆధారపడగలదని హామీ ఇచ్చారు. "మేము గతంలో ఎన్నడూ లేనంతగా భారతదేశానికి చేరువుగా ఉన్నాము. భారతదేశం నన్ను, మా దేశాన్ని 100 శాతం నమ్ముకోవచ్చు. వారికి ఏదైనా సహాయం కావాలంటే, ఎవరికి కాల్ చేయాలో వారికి తెలుసు. వారు ఇక్కడికే కాల్ చేస్తారు. మేము బాగా పని చేస్తున్నాము. మేము రికార్డులు సృష్టిస్తున్నాము" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మార్కో రూబియోను అమెరికా చరిత్రలో "గొప్ప సెక్రటరీ ఆఫ్ స్టేట్" గా కీర్తించిన ట్రంప్.. భారత్ కు అమెరికా నుండి ఏదైనా కావాలంటే అది లభిస్తుందని పేర్కొన్నారు. "మాకు రికార్డు స్థాయి ఆర్థిక వ్యవస్థ, రికార్డు స్టాక్ మార్కెట్ ఉన్నాయి. భారతదేశానికి ఏదైనా కావాలంటే, అది వారికి లభిస్తుంది. నేను ప్రధానమంత్రి మోదీకి పెద్ద అభిమానిని" అని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలు వెలువడిన తర్వాత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఆదివారం పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, వీసాలు, ఇంధన భద్రత, సరిహద్దు ఉగ్రవాదం, పశ్చిమ ఆసియా సంఘర్షణ ప్రభావాలపై దృష్టి సారించిన ఈ చర్చలు, ఉద్రిక్తతలకు గురైన ఇరు దేశాల సంబంధాలను తిరిగి గాడిన పెట్టే ప్రయత్నంగా భావించారు.
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్ కు వచ్చిన రూబియో, దిల్లీని ఒక ప్రధాన శక్తిగా అభివర్ణించారు. అమెరికా-భారత్ సంబంధాలు గత రెండు దశాబ్దాలుగా ఉన్న ఊపును కోల్పోయాయనే వాదనలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగిసేనాటికి ఈ బంధం మరింత బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం దిల్లీలోని సేవ తీర్థ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రూబియో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరఫున భారత ప్రధాని మోడీని వైట్ హౌస్ను సందర్శించాల్సిందిగా అధికారికంగా ఆహ్వానించారు. ఈ సమావేశం అనంతరం రూబియో ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.

"దిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశాను. అమెరికా-భారత్ సంబంధాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికే ఈ భేటీ. మధ్య ప్రాచ్య పరిస్థితి, ఇంధనం, కీలక సరఫరా గొలుసులను సురక్షితం చేయడం, ఉద్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలలో సహకారంపై అమెరికా-భారత్ భాగస్వామ్యాన్ని చర్చించాం. అధ్యక్షుడి తరఫున ప్రధానమంత్రి మోదీని వైట్ హౌస్ కు ఆహ్వానించడం నాకు సంతోషంగా ఉంది" అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications