జూనియర్ డాక్టర్ల చర్య అర్థరహితం: సుబ్బారావు
హైదరాబాద్: విషయం కోర్టు పరిధిలో ఉండగా జూనియర్ డాక్టర్లు ఈ శనివారం నుంచి సమ్మెకు దిగుతామనడం అర్థరహితమని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఐ.వి. సుబ్బారావు అన్నారు. జూనియర్ డాక్టర్ల సమస్య పరిష్కారం కేసులో తాము సోమవారం లోగా కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. జూనియర్ డాక్టర్లతో తాము చర్చించడానికి ఏమీ లేదని ఆయన అన్నారు. అన్ని విషయాలూ కోర్టు పరిధిలోనే ఉన్నాయని, అందువల్ల ప్రభుత్వం జూనియర్ డాక్టర్లతో చర్చించాల్సిన విషయమేదీ లేదని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని జూనియర్ డాక్టర్లు విమర్శిస్తున్నారు. తాము శనివారం నుంచి సమ్మెకు దిగుతామని, అత్యవసర సర్వీసులను కూడా నిలిపేస్తామని వారు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయకపోవడాన్ని వారు తప్పు పట్టారు.