దిగ్విజయ్ ఒత్తిడితోనే వైయస్తో భేటీ: నరేంద్ర
హైదరాబాద్: తమ నేత కె. చంద్రశేఖర్ రావుతో చర్చించడానికి సిద్ధం కాకపోతే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి తెలంగాణపై జరుగుతున్న అన్యాయాన్ని సరి చేయాలనే ఉద్దేశం లేదని అర్థం చేసుకోవాల్సి వుంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) నాయకుడు, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. తాము ఆరు డిమాండ్లను ముఖ్యమంత్రికి ఫాక్స్ ద్వారా పంపామని, వాటిపై ఇప్పటి వరకు స్పందించకపోవడం సరి కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ డిమాండ్లను వైయస్ ఒప్పుకోరని తమకు తెలుసునని, 610 జీవోను అమలు చేస్తే సచివాలయంలో వ్యతిరేకత వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ అనేది వైయస్ వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డితో చర్చించే ఉద్దేశం మొదట తమకు లేదని, అయితే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఒత్తిడి మేరకు తాము అందుకు అంగీకరించామని ఆయన చెప్పారు. బాధ్యత తాను తీసుకుంటానని, విభేదాలు ఉంటే పరిష్కరించుకోవడానికి వీలవుతుందని దిగ్విజయ్ సింగ్ తమతో చెప్పినట్లు, దాంతో తాము ముఖ్యమంత్రితో చర్చలకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమన్వయ కమిటీ (టిఆర్సిసిసి) నాయకులు తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడాలని ఆయన సూచించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి పుట్టగతులుండవని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీల అభిప్రాయం కోసం ప్రణబ్ ముఖర్జీ కమిటీ లేఖలు రాయడం అర్థరహితమని ఆయన అన్నారు.